TTD: తిరుమల నడక మార్గంలో బోనులో చిరుత ఇలా చిక్కింది..(వీడియో)..!!
Tirumala: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిందది. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా రెండు చిరుతలను టీటీడీ అటవీ శాఖ అధికారులు బందించారు. మరిన్ని చిరుతలు తిరుమల నడక మార్గంలోని అటవీ ప్రాంతలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నడక మార్గంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. చిన్నారులను మధ్నాహ్నం 2 గంటల తరువాత అనుమతించటం లేదు. ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించారు.
తిరుమల నడక మార్గంలో మరో చిరుత బోన్ లో ఎలా చిక్కిందో చుడండి..!! pic.twitter.com/K9iCRempg8
— oneindiatelugu (@oneindiatelugu) August 17, 2023
చిన్నారి లక్షితను చిరుత బలి తీసుకోవటంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులో ఉన్న ఆందోళనలను పోగొట్టే చర్యలు ప్రారంభించారు. మూడు రోజుల క్రితం నడక మార్గంలోని లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్ద ఒక చిరుత బోన్ లో చిక్కింది. ఈ రోజు తెల్లవారు జామున మరో చిరుత బోనులో చిక్కుకుంది.

చిరుతను బంధించటం పైన కొందరు టీటీడీ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చిరుత ఎలా చిక్కిందో వీడియోను ఈవో ధర్మారెడ్డి విడుదల చేసారు. చిరుత చిక్కిన ప్రాంతాన్ని ఛైర్మన్ భూమన, ధర్మారెడ్డి సందర్శించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి చెప్పారు.
అర్ధరాత్రి 1.30 గంటలకు తిరుమల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి, అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. బోనులో చిక్కింది మగ చిరుతగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు.

భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, భక్తులకు నడకదారిలో భద్రత కల్పిస్తూనే చిరుతను బంధించే చర్యలు చేపట్టామని వివరించారు. అటవీశాఖ అధికారుల సూచనతోనే భక్తులకు కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని, కర్రలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదన్నారు.
ఇదే సమయంలో కాలి నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న వారు రోడ్డు మార్గంలోనూ వెళ్లే వెసులుబాటు ఇవ్వటంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుంటున్నారు. ఇటు టీటీడీ ప్రత్యేక సిబ్బందితో కాలి నడక మార్గంలో వెళ్లే భక్తులకు భద్రత కల్పిస్తోంది. గుంపులుగా వెళ్లేందుకు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. ప్రత్యేక కెమేరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలను బంధించేలా కార్యచరణ రూపొందిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు.












Click it and Unblock the Notifications