పరిటాల సునీతకు వంశీ ఛాలెంజ్ - గన్నవరం నుంచి లోకేశ్ ను గెలిపించు : వదినా.. రాజీనామా చేస్తున్నా..!!
టీడీపీ మాజీ మంత్రి..పరిటాల సునీత చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తాను పరిటాల సునీతను వదినగానే చూస్తానని చెప్పారు. వంశీకి అప్పట్లోనే పరిటాల రవితో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే, ఇప్పుడు చంద్రబాబు దీక్ష వేదిక నుంచి సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు మారాలని సూచిస్తూ..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ సునీత వ్యాఖ్యానించారు.
పరిటాల సునీత కీలక వ్యాఖ్యలతో
తమలో ప్రవహించేది సీమ రక్తమేనని.. తన భర్తను చంపినప్పడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని చంద్రబాబు మారాలిని ఆమె సూచించారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ఓడిపోవడం ఖాయమంటూ సునీత వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో వాళ్లకు అవకాశం ఇచ్చారు కాబట్టే మంత్రులు, ఎమ్మెల్యేలుగా లీడర్లుగా ఎదిగారని పరిటాల సునీత చెప్పుకొచ్చారు. తాము వాళ్ల కంటే ఎక్కువగానే మాట్లాడగలమని చెప్పారు. అయితే, చంద్రబాబు తమను నియంత్రిస్తున్నారని..అలా మాట్లాడవద్దని చెబుతున్నారని పేర్కొన్నారు.
సునీతను తాను వదినగానే చూస్తానంటున్న వంశీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఈ రెండున్నారేళ్లుగా టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక, ఓపిక పట్టలేమని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల మీద స్పందించిన వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. వదిన సునీత మంత్రిగా ఉన్న సమయంలోనే...గుడివాడ నుంచి కొడాలి నాని గెలుపొందారని గుర్తు చేసారు. తల్లికి - గర్బస్థ శిశుకు గొడవలు పెట్టగలిగిన సత్తా చంద్రబాబుకు ఉందన్నారు. వచ్చే ఎన్నిలక వరకు ఎందుకు ఎదురు చూడటం.. ఇప్పుడే తాను గన్నవరం ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నానంటూ ఖాళీ లెటర్ హెడ్ మీద సంతకం చేసారు.
సునీతకు వంశీ సవాల్...రాజీనామా చేస్తున్నా
దానిని సునీతకు ఇవ్వాలని..ఏ విధంగా రాజీనామా లేఖ రాస్తే ఆమోదిస్తారో ఆ విధంగా రాసి స్పీకర్ కు పంపాలని కోరారు. పరిటాల సునీత సారథ్యం వహించి లోకేష్తో పోటీ చేయించి గన్నవరం నుంచి లోకేశ్ ను గెలిపించుకోవాలని వంశీ సవాల్ చేసారు. వదిన సునీత కృష్ణ సారధ్యం చేస్తారో లేదో అక్కడ లోకేశ్ ను బరిలోకి దింపుతారో..ఇంకా ఎవరినైనా దింపుతారో నిర్ణయించి..గెలిపించుకోవాలని ఛాలెంజ్ చేసారు. తాను గన్నవరానికి..కొడాలి నాని గుడివాడకు తొలి ఎమ్మెల్యే కాదని..తామే చివరి ఎమ్మెల్యేలం కాదని వ్యాఖ్యానించారు.
గన్నవరం నుంచి లోకేశ్ ను గెలిపించు
పరిటాల సునీతకు ఇప్పుడే ఎందుకు అంత కోపం వచ్చిందో చెప్పాలని కోరారు. పట్టాభి వ్యాఖ్యల తరువాత వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. చంద్రబాబు దీక్ష వేదిక వద్దకు వచ్చిన పలువురు టీడీపీ నేతలు సైతం వైసీపీ నేతలకు వార్నింగ్ లు ఇచ్చారు. అదే విధంగా వైసీపీ నుంచి మంత్రులు..నేతుల సైతం టీడీపీ నేతలను హెచ్చరించారు. అందులో భాగంగా..ఇప్పుడు పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు..స్పందనగా వంశీ సవాళ్లతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.
కొనసాగుతున్న మాటల తూటాలు
వంశీ ఛాలెంజ్ పైన సునీత ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. అయితే, లోకేశ్ మాత్రం చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా వచ్చిన మంగళగిరి టీడీపీ శ్రేణులను ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి గెలిపించి కానుకగా ఇస్తామంటూ చంద్రబాబుకు వారి సమక్షంలోనే హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు సునీత వ్యాఖ్యల పైన వంశీ స్పందించటంతో.. టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ సవాళ్లు - ఛాలెంజ్ లు రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.