మందుబాబుల్ని చూసి చంద్రబాబు షాక్.. ప్రపంచం చూపు ఏపీ వైపు.. జగన్పై పవన్ కల్యాన్ ఫైర్
లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో సోమవారం నుంచి దేశమంతటా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోకి.. ఆంధ్రప్రదేశ్ లో వైన్ షాపుల ముందు చోటుచేసుకున్న దృశ్యాలు హైలైట్గా, వైరల్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 67 కొత్త కేసులు రావడం, మొత్తంగా కేసుల సంఖ్య 1650కి పెరగినా.. మద్యం దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుపట్టారు.
చంద్రబాబు షాకింగ్..
సోమవారం ఉదయం ఏపీలోని గ్రీన్ జోన్లలో మద్యం షాపులు తెరవకముందే మందుబాబులు భారీగా పోగయ్యారు. అమ్మకాలు మొదలైన వెంటనే చాలా చోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల సీన్లు చూసి షాక్కు గురయ్యానని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ప్రధానంగా బాబు సొంత జిల్లా చిత్తూరులో జనం భారీగా మందు కోసం ఎగబడటం, దాదాపు అన్ని చోట్లా సోషల్ డిస్టెన్సింగ్ బేఖాతరు కావడంపై ఆయన మండిపడ్డారు.
జగన్ వైఫల్యమే..
‘‘లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులిచ్చారు. మద్యం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని ముందే ఊహించకుండా వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. సరైన ప్రణాళిక రూపొందించడంలో సీఎం జగన్ ఫెయిలయ్యారు కాబట్టే ఇవాళ ప్రతి చోటా సోషల్ డిస్టెన్సింగ్ స్ఫూర్తి దారుణంగా దెబ్బతినింది. సీఎం చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు మరిన్ని పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది''అని చంద్రబాబు ఫైరయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయనో ట్వీట్ చేశారు. అటు..
ప్రపంచం చూపు ఏపీ వైపు..
చంద్రబాబుతోపాటు టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు సైతం సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. రాజధాని తరలింపు మొదలుకొని కరోనా కట్టడిలో వైఫల్యం వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ జనం కొపలుముంచేవేనని టీడీపీ నేతలు విమర్శించారు. వైరస్ ఉధృతి తగ్గకముందే వైన్ షాపులు తెరవడం ద్వారా జగన్ కరోనాకు బ్లూకార్పెట్ వేసి స్వాగం పలికినట్లయిందని, ఇలాంటి తుగ్లక్ పనుల వల్లే ప్రపంచమంతా ఏపీవైపు చూసి నవ్వుకుంటున్నదని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనల్ని పాటిస్తూ పేదలకు సాయం చేసిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారని, అదే అధికార పార్టీ నేతలు మాత్రం ర్యాలీలు, ప్రారంభోత్సవాలు నిర్వహించినా పోలీసులు మిన్నకుండిపోయారని ఆరోపించారు.
సీఎం తేలికగా మాట్లాడటం వల్లే..
ఏపీలో కరోనా వైరస్ ఉధృతికి సీఎం జగన్ మాటలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ‘‘కొవిడ్-19 వ్యాధిని సాధారణ జ్వరం అని చాలా తేలికగా సీఎం మాట్లాడటం వల్లే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వైరస్ నియంత్రణ చర్యల్లో అలసత్వం వహించింది. పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే తమ పరిస్థితి ఏపీలోని కర్నూలు, గుంటూరులా అయి ఉండేదని తెలంగాణ మంత్రి కీలకవ్యాఖ్యలు చేసినా, వాటిని వైసీపీ సర్కారు లైట్ తీసుకుంది. ఏపీలో ఆరోగ్య శాఖ వైఫల్యం అడుగడుగునా బయటపడుతోంది. ఇప్పటికైనా జగన్ మేలుకుని వైరస్ నియంత్రణకు నడుం కట్టాలి''అని పవన్ అన్నారు. సోమవారం అనంతపురం జిల్లా నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో ఆయనీ కామెంట్లు చేశారు.
Recommended Video