ఏపీలో స్థానిక పోరు: తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాన్నే అనుసరించే ప్లాన్ లో జగన్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అన్ని చోట్ల ఏకగ్రీవాలు ఉండేలా చూడాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని దిశా నిర్దేశం చేస్తున్న సీఎం జగన్ తెలంగాణా సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహాన్ని అనుసరిస్తున్నారని తెలుస్తుంది.
స్థానిక సమరానికి సిద్ధం అవుతున్న వైసీపీ సర్కార్
స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జగన్ ఇక పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. చాలా పకడ్బందీ వ్యూహంతో ఎన్నికలకు వెళ్ళాలని ఆయన ఆదేశించారు .ఈ నెలాఖరులోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక ఇందుకోసం పావులు కదుపుతున్నారు.
ఎన్నికల ఫలితాలకు మంత్రులు , ఎమ్మెల్యేలదే బాధ్యత
ఏపీలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం విషయంలో ఏపీ సీఎం జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో భారీ విజయం నమోదు చెయ్యటానికి అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలపై పూర్తి బాధ్యత పెట్టారు. ఎన్నికల ఫలితాలకు వారే బాధ్యులు అవుతారని తేల్చేశారు.ఇక తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అందరికి అర్థమయ్యేలా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని తెలియజేశారు సీఎం జగన్.
సీఎం కేసీఆర్ బాటలో జగన్ ప్లాన్
ఇటీవల తెలంగాణలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టటంలో సక్సెస్ అయిన సీఎం కేసీఆర్ అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే సీఎం జగన్ కూడా అనుసరిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన గులాబీ పార్టీ వ్యూహాన్నే అనుసరించాలని సీఎం జగన్ చెప్పారని సమాచారం .
పదవులపై హామీ ఇవ్వొద్దని చెప్పిన జగన్
వీలైనంత వరకూ ఏకగ్రీవాల మీదనే ఫోకస్ పెట్టాలన్న జగన్ గ్రామ స్థాయి సర్పంచ్ నుండి మండల స్థాయి ఎంపీపీ , జిల్లా స్థాయిలో అన్ని స్థానాలు , మున్సిపాలిటీలలోనూ పట్టు చూపించాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఎవరికీ పదవుల మీద హామీ ఇవ్వకుండా ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలను అనుసరించి పదవుల పందేరం చెయ్యనున్నట్టు చెప్పినట్టు తెలుస్తుంది. జెడ్పీ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్, మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలనుకున్న విషయాల్ని ఎవరికి ముందస్తుగా హామీ ఇవ్వొద్దని సీఎం జగన్ మంత్రులకు చాలా స్పష్టంగా చెప్పారు.
వెన్నుపోటు దారులపై జాగ్రత్త .. తెలంగాణా ఎన్నికల స్కెచ్ రిపీట్
ఇక పార్టీలో ఉన్న నేతలే కొన్ని సందర్భాల్లో వెన్నుపోట్లు పొడిచే అవకాశం ఉందని కనుక అందరినీ కలుపుకుని పని చెయ్యాలని , ముఖ్యంగా రెబల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం చెప్పారు. ఇక ఎన్నికలు పూర్తి అయ్యాక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీతో పాటు జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు, మంత్రులు. ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి అప్పటి సమీకరణాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ ఈ తరహా వ్యూహంతోనే తెలంగాణా ఎన్నికల్లో వరుసగా సత్తా చాటారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించనున్నారు.