సీఎం జగన్ ఆదేశాలు మంత్రుల బేఖాతర్: వారసుల పదవుల కోసం: ముఖ్యమంత్రి సీరియస్..!
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను స్వయంగా ఆయన కేబినెట్ లోని మంత్రి ధిక్కరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు..నియోజకవర్గ ఇన్ఛార్జ్ ల కుటుంబ సభ్యులు..బంధువులు ఎవరూ ఎన్నికల బరిలో నిలవద్దని..అలా నిలిచిన వారికి బీ ఫారంలు ఇవ్వద్దంటూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. అయితే, వాటిని ఎమ్మెల్యేలే కాదు మంత్రులు సైతం ధిక్కరిస్తున్నారు. తమ వారికి పదవులు ఇప్పించుకొనేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా..అమలు చేయటం లేదు.
పోటీలో మంత్రుల బంధువులు
వైసీపీ తరఫున ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నవారు స్థానిక ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులను గానీ, బంధువులను గానీ పోటీకి దించొద్దని ఆ పార్టీ అధినేత జగన్ స్పష్టం చేసినా నాయకులు సీరియస్ గా తీసుకోవటం లేదు. ప్రధానంగా విశాఖతో పాటుగా గోదావరి జిల్లాల్లోనూ అదే విధంగా గుంటూరులోనూ ఈ పరిస్థితిని పార్టీ గుర్తించింది. దీని పైన పార్టీ కో ఆర్డినేటర్లు వైసీపీ అధినాయకత్వా నికి సమాచారం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయం ముగియటంతో..ఇక నామినేషన్ల ఉప సంహరణలోనూ తమ పైన విత్ డ్రా కోసం ఒత్తిడికి అవకాశం లేకుండా అధికార పార్టీ నేతలు వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు వీరి విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
సీఎం చెప్పినా లెక్కలేదు..
స్పీకర్ తమ్మినేనితో సహా మంత్రులు..ఎమ్మెల్యేలు తమ వారికి పదవుల కోసం ఎన్నికల బరిలోకి దించారు. శ్రీకాకుళం జిల్లా దూసి ఎంపీటీసీగా స్పీకర్ తమ్మినేని బంధువు తమ్మినేని శారద బరిలో నిలిచారు. మరో మంత్రి ధర్మాన క్రిష్టదాస్ తన కుమారుడు క్రిష్ణ చైత్యనను సొంత జిల్లా పోలకి జెడ్పీటీసీ అభ్యర్ధిగా నిలబెట్టారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కుమారుడు రెడ్డి శ్రవణ్ ను పోలకి జెడ్పీటీసీగా బరిలో దించారు. విశాఖ జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనూహ్యంగా తన కుమార్తె ప్రియాంకతో జీవీఎంసీ 6వ వార్డుకు నామినేషన్ వేయించారు. విజయ నగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి తన కుమార్తెను కార్పోరేటర్ గా పోటీలో దించారు. మరో మంత్రి బొత్సా సత్యనారాయణ అల్లుడు చిన్నశ్రీను సైతం కార్పోరేటర్ గా నామినేషన్ దాఖలు చేసారు.
ముఖ్యమంత్రి ఏం చేస్తారు..
అదే విధంగా టెక్కలి..ఇచ్ఛాపురం నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులుగా పోటీ చేసిన ఓడిన సాయిరాజ్.. తిలక్ సతీమణులు సైతం ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసారు. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ కె.కోటపాడు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేయగా, కుమారుడు రవి దేవరాపల్లి జడ్పీటీసీకి రెబల్గా వేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుటుంబం నుంచి ఇద్దరిని కార్పొరేటర్లుగా పోటీకి దింపారు. నియోజకవర్గంలోని 74వ వార్డు నుంచి కుమారుడు వంశీరెడ్డితో నామినేషన్ వేయించారు.
Recommended Video
అంతా నేతల బంధువులే
నాగిరెడ్డి తన కోడలు ఎమిలి జ్వాలతో 75వ వార్డుకు నామినేషన్ వేసారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల తన తోటికోడలైన పద్మతో ఒకటో వార్డుకు నామినేషన్ దాఖలు చేయించారు. ఇక, ఇప్పుడు మంత్రులు సైతం సీఎం మాట బేఖాతర్ చేస్తూ తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించటం పైన ముఖ్యమంత్రి పూర్తి సమాచారం తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ముఖ్యమంత్రి వీరి వ్యవహార శైలితో పాటుగా బరిలో నిలిచిన వారి పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.