లాక్ డౌన్ ఎఫెక్ట్ : విజయవాడలో రేపటి నుంచి ఆంక్షలు మరింత కఠినతరం- బయటికొచ్చే సమయాలివే..
ఏపీ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఇవాళ ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ వివిధ కారణాలతో యథావిథిగా రోడ్లపైకి వచ్చేశారు. దీంతో లాక్ డౌన్ అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికీ నిఘా నివేదికలు వెళ్లాయి. వీటి ఆధారంగా ప్రభుత్వం రేపటి నుంచి నిబంధనలు ఉల్లంఘించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

విజయవాడలో మరింత కఠిన ఆంక్షలు..
కరోనా ప్రభావం నేపథ్యంలో విజయవాడ నగరంలో విధించిన లాక్ డౌన్ ను ప్రజలు ఇవాళ ఖాతరు చేయకపోవడంతో రేపటి నుంచి మరింత కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సాధారణ ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు ఏయే సమయాల్లో ఇళ్ల నుంచి బయటికి రావాలో సూచిస్తూ ఓ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీన్ని కఠినంగా అమలు చేయబోతోంది. ఉల్లంఘిస్తే అరెస్టుల వరకూ వెళతామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

విజయవాడలో ఆంక్షల సమయాలివే..
తాజాగా అధికారులు ప్రకటించిన ఆంక్షల ప్రకారం చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి 9 గంటల వరకూ నగరంలో కిరాణా షాపులు, పళ్ల మార్కెట్, రైతు బజార్లు, కాళేశ్వరరావు మార్కెట్ తెరచి ఉంచుతారు. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ పాలు, ఇతర డైరీ ఉత్పత్తులను కొనుగోళ్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకూ ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాలను, సిబ్బందిని బయట అనుమతిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ హోటళ్ల నుంచి పార్సిళ్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

వీటికి పూర్తిగా అనుమతి నిరాకరణ..
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 31 వరకూ జ్యూయలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్ & ఐస్ క్రీమ్ పార్లర్స్, రెడీమేడ్ షాప్స్, హోటల్స్ & రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, ఐరన్ & స్టీల్ షాప్స్, గ్లాస్ & ప్లైవుడ్ షాప్స్, పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్ & ఆటోనగర్ లో షాపులు తెరిచేందుకు అనుమతి లేదు.

వీటికి 24 గంటలూ అనుమతి..
నగరంలోని అత్యవసర సేవలకు వినియోగించే అన్ని వాహనాలకూ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా అనుమతి ఇస్తున్నారు. ప్రభుత్వ, పోలీస్, ఫైర్, విద్యుత్, రెవెన్యూ, వీయంసీ, వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన వాహనాలకు 24 గంటలూ తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాహనాలకూ, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వాహనాలు, మొబైల్ కమ్యునికేషన్స్ వాహనాలకూ ప్రత్యేక అనుమతి ఇస్తున్నారు. వీటికి సమయంతో సంబంధం లేకుండా అనుమతివ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఎక్కడా పదిమంది గుమిగూడి ఉండొద్దని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications