బహిరంగ చర్చకు రా!.. నిజనిజాలేంటో తేలుతాయి: జగన్కు లోకేష్ సవాల్
బహిరంగ చర్చకు వస్తే నిజనిజాలు తేలుతాయని ప్రతిపక్ష అధినేత జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సవాల్ విసిరారు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత జగన్.. నోట్ల రద్దు గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముందస్తు సమాచారం ఉందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రద్దు విషయం ముందుగా తెలిసింది కాబట్టే.. హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్ కు కట్టబెట్టారని జగన్ ఆరోపిస్తున్నారు.
బహిరంగ చర్చకు వస్తే నిజనిజాలు తేలుతాయని సవాల్ విసిరారు. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి హెరిటేజ్ షేర్ రూ.199 ఉందని, రెండున్నరేళ్లలో రూ.900కు పెరిగిందని.. .నోట్ల రద్దుకు రెండు రోజుల ముందే హెరిటేజ్ షేర్లను అమ్మేసారని జగన్ విమర్శించారు.
కాగా, జగన్ విమర్శలపై టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ స్పందించారు. బహిరంగ చర్చకు వస్తే నిజనిజాలు తేలుతాయని సవాల్ విసిరారు. నిండా అవినీతిలో కూరుకుపోయిన జగన్ లాంటి నేత హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. జగన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.
ఇంతకుముందు కూడా బహిరంగ చర్చకు సిద్దం అని తాను ప్రకటించానని, కానీ వైసీపీ నేతలెవరూ ముందుకు రాలేదని లోకేష్ తెలిపారు. ఇప్పుడైనా చర్చకు వస్తే నిజనిజాలేంటో తేలుతాయని జగన్ ను సవాల్ చేశారు.