ఇదో పవిత్ర కార్యం.. ప్రచారం అదరగొట్టండి?: బాబు దీక్షపై లోకేష్..
అమరావతి: ధర్మపోరాట దీక్ష పేరుతో ఈ నెల 20 వ తేదీన సీఎం నారా చంద్రబాబు తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు సంబంధించి సచివాలయంలో నలుగురు మంత్రులతో కూడిన ఉప సంఘం భేటీ అయింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. మంత్రులు నారా లోకేష్, దేనినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో పాల్గొన్నారు.
సీఎం సాహస దీక్ష..: కళా వెంకట్రావు
68 ఏళ్లలో వయస్సులో చేపడుతున్న సాహస దీక్ష 'ధర్మ పోరాట దీక్ష' అని మంత్రి కళా వెంకట్రావ్ సమావేశంలో అన్నారు. ఈ సాహస కార్యక్రమానికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. దీక్షలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ నిరశన దీక్షలో పాల్గొంటారని చెప్పారు.
స్టేడియంలో రెండు వేదికలు:
విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ దీక్ష జరుగుతుందని, దీనికి సంబంధించిన పనులను కలెక్టర్ లక్ష్మీకాంతం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. స్టేడియంలో రెండు వేదికలు ఏర్పాటు చేయాలని కళా వెంకట్రావు కలెక్టరును ఆదేశించారు. ఒక వేదికపై చంద్రబాబు దీక్ష కార్యాక్రమం, మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ప్రధాన వేదికపై 150 మంది, వేదిక ముందు 10వేల మంది కూర్చునేలా కుర్చీలు వేయాలని ఆదేశించారు.
ఏర్పాట్లపై లోకేష్:
ధర్మపోరాట దీక్షకు సంబంధించిన ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనిరాష్ట్ర సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లును మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.దీక్ష జరిగే స్టేడియంతో పాటు, స్టేడియం బయట కూడా టెంట్లు వేయించాలని, 19వ తేదీ నాటికే ఏర్పాట్లన్ని పూర్తి కావాలని అన్నారు. అలాగే ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు స్టేడియం బయటా, లోపల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు.
ఇదో పవిత్ర కార్యం:
ధర్మపోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలనూ, అఖిలపక్ష నేతలనూ ఆహ్వానిస్తున్నామని లోకేష్ అన్నారు. వారితో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, వాణిజ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలు తదితర అన్ని వర్గాలు దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇందుకోసం అన్ని వర్గాల వారికి లేఖలు రాయనున్నట్టు తెలిపారు. దీక్ష రోజున సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షకు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పట్టేలా ఉండాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్ ను ఆదేశించారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో చంద్రబాబు చేయబోతున్న పవిత్ర దీక్ష ఇది అని చెప్పుకొచ్చారు.