లోకేష్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు - వైసీపీ చేతికి కొత్త అస్త్రం..!?
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానుంది. 27న కుప్పం నుంచి మొదలయ్యే ఈ యాత్ర కోసం పార్టీ నేతలంతా తరలి వస్తున్నారు. నందమూరి కుటుం సభ్యులు హాజరు కానున్నారు. 400 రోజుల పాటుగా నాలుగు వేల కిలో మీటర్లు లోకేష్ యాత్ర సాగనుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ ఖరారు చేసారు. ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్రకు పోలీసుల నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. ఇప్పటికే ఈ యాత్ర పైన వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపిక చేసిన రూట్ మ్యాప్.. నియోజకవర్గాల పైన చర్చ మొదలైంది. అందునా టీడీపీ టార్గెట్ చేసిన వైసీపీ కంచుకోటలు లేకపోవటం ఇప్పుడు డిస్కషన్ కు కారణమవుతోంది.

లోకేష్ పాదయాత్ర కు భారీ ఏర్పాట్లు
ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్న లోకేష్ యువగళం యాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మహానాడు తరహాలో పార్టీ నేతలంతా యువగళం ప్రారంభానికి హాజరు కానున్నారు. మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోనే లోకేష్ యాత్ర కొనసాగనుంది. పార్టీ సీనియర్లు.. నియోజకవర్గాల ఇంఛార్జ్ లు..అనుబంధ సంఘాల నేతలతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్ కు మద్దతుగా కుప్పం కు రానున్నారు. పూర్తిగా 400 రోజుల పాటుగా నాలుగు వేల కిలో మీటర్ల యాత్ర నిర్వహించేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ ఫిక్స్ చేసారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రోడ్ షో..సమావేశాలు నిర్వహించనున్నారు. యువత పెద్ద సంఖ్యలో లోకేష్ ను అనుసరించేలా ప్రణాళికలు సిద్దం చేసారు.

పులివెందులకు దూరంగా యాత్ర
లోకేష్ పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ కంచుకోట పులివెందుల లేదు. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ లోకేష్ కడప జిల్లాలో ప్రవేశిస్తారు. ఆ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పులివెందుల, జమ్మల మడుగు లో మాత్రం లోకేష్ యాత్ర లేదు. మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా చంద్రబాబు -లోకేష్ రాజకీయ యుద్దం చేస్తున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనూ పాదయాత్ర ద్వారా సత్తా చాటాల్సిన సమయంలో..అసలు ఆ నియోజకవర్గం టచ్ చేయకపోవటం పార్టీ నేతలకు రుచించటం లేదు. రూటు కలిసి రాకపోయినా..కలుపుకోవాల్సిన వేళ..కీలక నియోజకవర్గం తప్పించటం వెనుక అనేక రకాల చర్చలు తెర పైకి వస్తున్నాయి. కడప జిల్లా వైసీపీకి కంచుకోట. అందునా కీలకమైన పులివెందుల..జమ్మల మడుగు రెండు నియోజకవర్గాలు లోకేష్ రూట్ మ్యాప్ లో లేకపోవటం వైసీపీ చేతికి కొత్త అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.

రోజా - కొడాలి నాని ఇలాకాల్లో ఎంట్రీ
సీఎం జగన్ నియోజకవర్గంలో పాదయాత్ర జోరుగా నిర్వహిస్తే ఆ కిక్కే వేరంటున్నారు టీడీపీ నేతలు. కానీ, ఇప్పటి వరకు రూట్ మ్యాప్ లో పులివెందుల లేదు. ఇక.. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న మంత్రి రోజా నియోజకవర్గంలో లోకేష్ యాత్ర కొనసాగనుంది. అదే విధంగా కొడాలి నాని నియోజకవర్గంలోనూ లోకేష్ యాత్ర ఫిక్స్ అయింది. ఫిబ్రవరి తొలి వారంలోనే నగరిలో లోకేష్ యాత్ర కొనసాగనుంది. కొడాలి నాని నియోజకవర్గంలో మాత్రం మరో మూడు నెలల తరువాత ఉండే అవకాశం ఉంది. రాజకీయంగా లోకేష్ కు టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్న ఈ యాత్రలో ప్రసంగాలు.. ప్రజలకు దగ్గరయ్యే అంశాల పైన గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు వచ్చే స్పందన..వైసీపీ రియాక్షన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications