బంగాళాఖాతం నుంచి ఏపీకి మరో మేఘసందేశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయి. మెరుపులు, ఉరుములతో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశువుల కాపర్లు, రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని, చెట్లకిందకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. సముద్రతీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని, తీరం వెంబడి ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈరోజు శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.
పొలాల్లో తీవ్రమైన సుడిగాలి
వీటితోపాటు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, తిరుపతి, ఎన్టీఆర్, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినానడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అల్లూరి జిల్లాల్లోని డుంబ్రిగూడ మండలం దేముడువలస దగ్గర పొలాల్లో సుడిగాలి రావడంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. కొంతసేపటికి తగ్గిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులతోపాటు తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ నుంచి అతి భారీ వర్షాల సూచన లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

తీవ్రంగా నష్టపోయిన ఏపీ
ఇటీవల కురిసిన వర్షాలకు వదరలు పోటెత్తి ఏపీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. బుడమేరు పొంగడంతో విజయవాడ నగరం సగం మునిగిపోయింది. వీటివల్ల పదుల సంఖ్యలో ప్రజలు కూడా మృతిచెందారు. తీవ్రమైన ఆస్తినష్టం, పంట నష్టం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి సహాయక కార్యక్రమాలకు పర్యవేక్షించారు. బాధితులకు వరద నష్ట పరిహారం కింద రూ.25వేలు పంపిణీ చేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు దాదాపు రూ.400 కోట్ల విరాళాలను అందజేశారు.












Click it and Unblock the Notifications