బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా తేలికపాటి జల్లులు కురుస్తోన్నాయి. ఇవే పరిస్థితులు నేడు, రేపు కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడటమే దీనికి కారణం. ఇది క్రమంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్కడ నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఏపీఎస్డీఎంఏ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ అల్పపీడనం ప్రభావం మూడు రాష్ట్రాలపై పడుతోంది. పశ్చిమ బెంగాల్ మొదలుకుని ఉత్తరాంధ్ర వరకూ కొనసాగనుంది. ప్రత్యేకించి.. పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్ లల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా తీరంలోని బాలాసోర్, భద్రక్, మయూర్ భంజ్, సుందర్ గఢ్, కియోంఝార్ వంటి జిల్లాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంది.ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
దీని ప్రభావం ఉత్తరాంధ్రపై పడుతుందని ఎస్డీఎంఏ వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.












Click it and Unblock the Notifications