జగన్,పవన్ ఆ సీటుపై ఆరా - ప్రతిష్ఠాత్మకం, గెలుపెవరిది..!!
ఈ సారి ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. పలు నియోజకవర్గాల్లో గెలుపు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పార్టీ అధినేతలు స్వయంగా కొన్ని సెగ్మెంట్ల పైన ఫోకస్ చేసారు. మచిలీపట్నంలో ఈ సారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇక్కడ సీఎం జగన్ కు విధేయుడు నాని కుమారుడు వైసీపీ నుంచి పోటీ చేసారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర బరిలో నిలిచారు. కానీ, నిత్యం పవన్ ను టార్గెట్ చేసే నాని నియోజకవర్గం కావటంతో వైసీపీ, కూటమికి ఇక్కడ గెలుపు కీలకంగా భావించారు.
హోరా హెరీ పోరు
మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పేర్ని కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన కిట్టు పోటీ చేసారు. పేర్ని కుటుంబం ఇక్కడ పోటీ చేయటం ఇది ఏడోసారి. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర నాలుగో సారి బరిలో నిలిచారు. ఈ సారి మాజీ మంత్రి పేర్ని నాని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుని తన తనయుడి విజయం కోసం ప్రచారం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మచిలీపట్నంలో పేర్ని ఫ్యామిలీ ఆ పార్టీకి ప్రత్యర్ధిగా ఉంటూ వచ్చింది. 2014లో ఓఢిపోయి.. 2019లో గెలుపొందిన నాని వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు.. ఈ సారి తన తనయుడు పేర్ని కిట్టూని పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు.

సమీకరణాలు కలిసొచ్చేనా
గత ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడిపోయిన కొల్లు రవీంద్ర పేర్ని కిట్టు మధ్య హోరా హోరీ పోరు సాగింది. ప్రభుత్వ వ్యతిరేకత..టీడీపీ మేనిఫెస్టో ఆధారంగా రవీంద్ర ప్రచారం సాగించారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానిపై పెరిగిన ప్రజా వ్యతిరేకత కిట్టు విజయంపై ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే విధంగా కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నా..నియోజకవర్గానికి ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన ఉంది. అయితే, స్థానికంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటే జనసేనతో పొత్తు కలిసొచ్చే అంశంగా మారింది. నిత్యం పవన్ పైన విరుచుకుపడే పేర్నినాని కుటుంబం ఇక్కడ ఓడాలనే విధంగా జనసేన సైతం టీడీపీకి సహకారం అందించారు.
గెలుపు పై ధీమా
ముఖ్యమంత్రి జగన్ కు మచిలీపట్నం లో పేర్ని నాని కుమారుడు కోసం ప్రచారం చేసారు. కిట్ట గెలుస్తారనే నమ్మకం నాని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా మచిలీపట్నం పోర్టు..ప్రభుత్వ సంక్షేమం..మహిళా ఓట్ బ్యాంకు తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, మచిలీపట్నంలో ప్రధాన ఓట్ బ్యాంక్ గా ఉన్న సామాజిక ఓటర్లు ఎక్కువ మొత్తంలో ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయం ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో ఇతర వర్గాల ఓట్లు కీలకంగా మారాయి. ఓటింగ్ సరళి తరువాత రెండు పార్టీలు గెలుపు పైన ధీమాగా ఉన్నాయి. దీంతో..గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications