తిరుపతి ఉపఎన్నిక వేళ... జనసేనకు షాక్... పవన్పై అసంతృప్తితో సీనియర్ నేత రాజీనామా...
తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా ఎవరికీ విలువ లేకుండా పోయిందని గంగాధరం ఆరోపించారు. అంతేకాదు,అసలు పార్టీలో ఏం జరుగుతోందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని... కష్టపడేవారికి గుర్తింపు లేదని ఆరోపించారు. ఈ మేరకు మాదాసు గంగాధరం జనసేన అధినేత పవన్ కల్యాణ్కు లేఖ రాశారు.

నాదెండ్లకు మాత్రమే విలువ..!!
పార్టీలో సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వట్లేదని మాదాసు గంగాధరం లేఖలో వాపోయారు. ఒక్కరికి మినహా పార్టీలో మిగతా ఎవరికీ విలువ ఇవ్వట్లేదని అన్నారు. పార్టీలో నాదెండ్ల మనోహర్కు మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని.. మిగతావారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మూడేళ్ల క్రితం పార్టీలో చేరానని గంగాధరం గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనకు ఎటువంటి గుర్తింపు లేకుండా పోయిందన్నారు.

పార్టీలో అసలేం జరుగుతుందో..
జనసేన పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ అసలు ఫోకస్ పెట్టట్లేదని మాదాసు గంగాధరం ఆరోపించారు. పార్టీ కమిటీలు కూడా సరిగా లేవని అన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఓడిపోయిన గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కష్టకాలంలో వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత పవన్పై ఉందన్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి స్పష్టమైన హామీ తీసుకోలేదని పేర్కొన్నారు.

సినిమా వేరు.. రాజకీయం వేరు...
సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని... ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకుండా వ్యవహరిస్తే తనలాంటోళ్లు మీతో కలిసి పనిచేయడం కష్టమని పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.జనసేన ఓ రాజకీయ పార్టీగా పని చేయడం లేదన్నారు. పార్టీలో ఒక్కరికి మినహా మిగతా వ్యక్తులకు విలువ లేకుండా చేయడం సమంజసం కాదన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో ఐదు రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక జరగనుండగా.. ఇంతలో జనసేన సీనియర్ నేత పార్టీ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్గా మారింది. గతంలో జనసేనకు రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కూడా పవన్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ప్రజాసేవకే జీవితం అంకితం చేస్తానని చెప్పిన వ్యక్తి మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం ఆయన నిలకడ లేమిని ఎత్తిచూపుతోందని లక్ష్మీనారాయణ అప్పట్లో విమర్శించారు.












Click it and Unblock the Notifications