మహానాడుపై మల్లగుల్లాలు: ఆదర్శంగా నిలవాలా.. ఆర్భాటంగా సాగాలా?
తెలుగు తమ్ముళ్ల గుండెల్లో పసుపు పండుగగా పిలవబడే 'మహానాడు' నిర్వహణపై తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే భారీ బహిరంగ సభ, మరోవైపు దేశ ప్రధాని పిలుపు మేరకు పాటించాల్సిన పొదుపు చర్యలు.. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే దిశగా పార్టీ అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తోంది. గురువారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ నిర్వహించిన 'బ్రేక్ఫాస్ట్ మీటింగ్'లో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా దేశీయంగా పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బాధ్యతాయుతమైన అధికార పార్టీగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానానికి అనుగుణంగా ఈ పొదుపు మంత్రాన్ని మహానాడులోనూ పాటించాలా అన్న అంశంపై మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే రెండు రోజుల ప్రతినిధుల సభలు నిర్వహించి, మూడో రోజు లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడం వల్ల వేల సంఖ్యలో వాహనాలు వినియోగించాల్సి ఉంటుందని, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసం అన్న కోణంలో చర్చ సాగింది.

సభ ఉంటుందా? ప్రతినిధుల సమావేశానికే పరిమితమా?
బహిరంగ సభ నిర్వహిస్తే రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తెలుగు తమ్ముళ్లు తరలివస్తారని, తద్వారా ఇంధన వినియోగం భారీగా పెరుగుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఆదర్శంగా నిలవాలంటే.. ఈసారికి బహిరంగ సభను పక్కన పెట్టి, కేవలం ప్రతినిధుల సమావేశాలకే మహానాడును పరిమితం చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనలు లోకేశ్ ముందు ఉంచారు. ఒకవేళ బహిరంగ సభ లేకపోతే పార్టీ శ్రేణులకు ఎలా సందేశం పంపాలన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
తుది నిర్ణయం చంద్రబాబుదే!
మంత్రుల నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను విన్న నారా లోకేశ్.. మహానాడు స్వరూపంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణకు, ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే చంద్రబాబు.. అటు కేడర్ ఉత్సాహాన్ని, ఇటు దేశ పరిస్థితులను బేరీజు వేసి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం బహిరంగ సభ లేకుండా, అర్థవంతంగా పసుపు పండుగను నిర్వహించేందుకే అధిష్టానం మొగ్గు చూపవచ్చని ప్రచారం జరుగుతోంది.














Click it and Unblock the Notifications