సంచైతకు మరో ఎదురుదెబ్బ- సింహాచలం ఈవో బాటలోనే మాన్సాస్ ఈవో..
ఏపీలో దేవస్ధానాల వ్యవహారాల్లో ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ప్రభుత్వానికీ, పాలకమండళ్లకూ మధ్య సంధాన కర్తలుగా వ్యవహరించాల్సిన అధికారులు ఒత్తిళ్లతో ఒకరి వెంట మరొకరు తప్పుకోవాలని భావిస్తుండటం సంచలనంగా మారింది. తాజాగా సింహాచలం ట్రస్టు మాజీ ఈవో భ్రమరాంబ దేవస్ధానం వ్యవహారాల్లో ఇతరుల ప్రమేయంపై ఆలయ ఛైర్పర్సన్ సంచయిత గజపతిరాజుకు లేఖ రాసి మరీ తప్పుకోవడం కలకలం రేపుతుండగానే ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.
సింహాచలం దేవస్ధానం ఈవో భ్రమరాంబ బాటలోనే సంచయిత గజపతిరాజు ఛైర్పర్సన్గా ఉన్న మాన్సాస్ ట్రస్టుకు ఇన్ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న మాధవి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకోవడం సంచలనం రేపుతోంది. తాజాగా ఈవోకు తెలియకుండా సంచయిత మాన్సాస్ ట్రస్టుకు చెందిన ఓ ఇసుక లీజుపై ఒప్పందాలు కుదుర్చుకోవడం వివాదాస్పదమైన నేపథ్యంలో తనను తప్పించాలంటూ ఈవో మాధవి దేవాదాయశాఖ కమిషనర్కు లేఖ రాశారు. ఇప్పటికే స్ధానిక కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా మాధవి కొనసాగుతున్నారు.
దేవాదాయశాఖ కమిషనర్కు రాసిన లేఖలో మాన్సాస్ ట్రస్టు ఈవో మాధవి వ్యక్తిగత కారణాలను ప్రస్తావించారు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం తనకు అదనంగా ఉన్న మాన్సాస్ ట్రస్ట్ బ్యాధ్యతలు చూడలేకపోతున్నానంటూ.. మాధవి తన లేఖలో వివరణ ఇచ్చారు. దీంతో ఆమెను తప్పించక తప్పని పరిస్ధితి నెలకొంది. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే సంచైత ఆధ్వర్యంలోని రెండు ఆలయ ట్రస్టుల్లో ఈవోలు విధుల నుంచి తప్పుకున్నట్లు అవుతుంది.