ర్యాంకుల కోసం మాల్ ప్రాక్టీస్-నారాయణతో పాటు తిరుపతి డీన్ అరెస్ట్-చిత్తూరు ఎస్పీ వెల్లడి
ఏపీలో కాకరేపుతున్న మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంలో చిత్తూరు జిల్లా పోలీసులు ఇవాళ వివరాలు వెల్లడించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లో నారాయణ అరెస్టుకు దారి తీసిన కారణాల్ని ఆధారాలతో సహా వెల్లడించారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా జరిగిన మాల్ ప్రాక్టీస్ లో నారాయణ పాత్రను వారు నిర్ధారించారు.
పదో తరగతి తెలుగు పరీక్షా ప్రశ్నాపత్రం గత నెల 27న వాట్సాప్ ద్వారా లీకైందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్టులు చేసినట్లు ఆయన వెల్లడించారు. లీకులకు కారణమైన నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నారాయణ పాత్ర నిర్దారించామన్నారు. ఈ కేసులో నారాయణతో పాటు తిరుపతి డీన్ బాలగంగాధర్ తిలక్ ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మాల్ ప్రాక్టీస్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనుక సాంకేతిక ఆధారాలున్నాయని చిత్తూరు పోలీసులు తెలిపారు. ర్యాంకుల కోసమే మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. తమ విద్యార్ధులు ఎక్కడున్నారో అక్కడ ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగా తీసుకుని మాల్ ప్రాక్టీస్ చేశారని వారు తెలిపారు. గతంలోనూ ఇలాగే చేశారని తెలిపారు. అటెండర్లు, బాయ్స్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపేవారని వాటిని వాడుకుని విద్యార్దులు ర్యాంకులు సాధించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నారాయణతో పాటు గతంలో అక్కడ పనిచేసి ఇప్పుడు చైతన్య, ఎన్ఆర్ఐ సంస్ధల్లో పనిచేస్తున్న సిబ్బందినీ అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు మాల్ ప్రాక్టీస్ కేసులో అరెస్టైన నారాయణ, బాలగంగాధర్ తిలక్ లను కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని చిత్తూరు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చిత్తూరు ఎస్పీ ఆఫీసులో ఉన్న వీరిద్దరినీ పీఎస్ కు తరలించి అక్కడ లాంఛనాలు పూర్తి చేశాక మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు.