భాషా సాంస్కృతిక డైరెక్టర్గా మామిడి హరికృష్ణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా మామిడి హరికృష్ణ మంగళవారంనాడు బాధ్యతలు తీసుకున్నారు. ఈ శాఖ డైరెక్టర్గా మామిడి హరికృష్ణను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ తన మాతృ సంస్థ సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ అయ్యారు.
మామిడి హరికృష్ణ వరంగల్ జిల్లా శాయంపేట గ్రామంలో జన్మించి అక్కడే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ వరంగల్లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ (సైకాలజీ), కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఈడి చేశారు.
తెలంగాణ పుట్టి పెరగడం ద్వారా తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి పట్ల అపారమైన మక్కువతో తెలంగాణ మాండలికంలో వివిధ పత్రికలకు వ్యాసాలు, కవర్ స్టోరీలు రాసి, ఎంతో పేరు గడించారు. సినీ విశ్లేషకులుగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతులు పొందారు. నంది బహుమతుల జ్యూరీ సభ్యుడిగా కూడా పనిచేశారు.
తెలంగాణ కవితలను ఆంగ్లంలోకి అనువదించి తెలంగాణ కవితలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. కవిగా, సినీ విశ్లేషకుడిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా, పెయింటర్గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ప్రశంసలు అందుకున్నారు.
తెలంగాణ సర్వశిక్షా అభియాన్ స్టేట్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా పనిచేసిన మామిడి హరికృష్ణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా నియమితులైనందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.