ఫినోల్ కలిపిన కల్లు తాగించి ప్రియురాలి హత్య
అంబర్పేటకు చెందిన యాదగిరికి తమ పక్కనే ఉండే 45 ఏళ్ల గౌరవమ్మ అనే విధవతో అక్రమ సంబంధం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని గౌరవమ్మ ఒత్తిడి తెస్తూ వచ్చింది. దీంతో అతను ఆమెను వదిలించుకోవడానికి పథకం వేశాడు.
ముందు వేసుకున్న పథకం ప్రకారం యాదగిరి గౌరవమ్మను ఎల్బీ నగర్లోని చింతల్లో గల కల్లు దుకాణానికి తీసుకుని వెళ్లి నాలుగు సీసాల కల్లు కొన్నాడు. గౌరవమ్మను ఆ తర్వాత నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. రహస్యంగా ఫినోల్ కలిపిన కల్లును ఆమెతో తాగించాడు. కల్లు తాగిన తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను అక్కడే వదిలేసి అతను వెళ్లిపోయాడు.
గౌరవమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను గుర్తించలేక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గౌరవమ్మ కనిపించకపోవడంతో ఆమె కూతురు స్వాతి పోలీసులకు పిర్యాదు చేసింది. వారం రోజుల క్రితం స్వాతి యాదగిరి ఇంటికి వెళ్లి తన తల్లి గురించి వాకబు కూడా చేసింది.
యాదగిరి సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో స్వాతి తన తల్లికి యాదగిరితో గల సంబంధం గురించి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు మంగళవారం యాదగిరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అతను నేరం అంగీకరించాడు. యాదగిరి అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు.