భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సంబంధం: సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు
తనతో ఓ మహిళ సన్నిహితంగా ఉన్నప్పుడు చిత్రీకరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు.
కాకినాడ: తనతో సన్నిహితంగా ఉన్న మహిళ వ్యక్తిగత దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంపై ఆ మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం డీఎస్పీ ఎల్. అంకయ్య ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఐ.పోలవరం మండలం చినతిల్లకుప్ప గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ భర్తతో విడిపోయి ఇంటింటికీ తిరిగి దుస్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
దుస్తుల కొనుగోలుకు ఆమె ద్వారపూడి, రాజమహేంద్రవరం వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామానికి చెందిన కారుడ్రైవర్ పలివెల వెంకట సూరిబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది.
వారు మురమళ్ల, అమలాపురం లాడ్జిల్లో పలు పర్యాయాలు కలుసుకున్నారు. ఆ సమయంలో సెల్ఫోన్లో చిత్రీకరించిన పలు దృశ్యాలను సూరిబాబు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఆ పోస్టింగ్లు చివరికి ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో ఆమె సూరిబాబును నిలదీసింది.
తనకు ఇష్టం వచ్చిన వారికి చూపిస్తానని, ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానని సూరిబాబు ఆ మహిళను బెదిరించాడు. దీంతో సూరిబాబుపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ దర్యాప్తు అనంతరం వెంకటసూరిబాబును అరెస్ట్ చేసి అమలాపురం కోర్టులో హాజరు పరిచారు.