వివాహేతర సంబంధం: ప్రియురాలిపై కత్తితో దాడి...తాను కూడా పొడుచుకున్న ప్రియుడు
గుంటూరు జిల్లా: ఇంతకాలం తనతో సహజీవనం చేసిన ప్రియురాలి ఇక తనను వదిలేస్తుందేమో నన్న అనుమానంతో ఆమెపై కత్తితో దాడిచేసి తానూ గాయపర్చుకున్న ప్రియుడి ఉదంతమిది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
సత్తెనపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సత్తెనపల్లి నివాసి అయిన కమ్మనేతుల రామాంజనేయులు వివాహితుడు. ఇతడు పాత బస్టాండ్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదురుగా బడ్డీ కొట్టు నిర్వహిస్తుంటాడు. ఇతడికి ఐదేళ్ల క్రితం తన బడ్డీకొట్టు ఎదురుగా ఉన్నహాస్పిటల్ ల్యాబ్లో పనిచేసే సకినేల అరుణతో పరిచయమైంది. సకినేల అరుణ స్వస్థలం కృష్ణా జిల్లా కంచికచర్ల.

పరిచయం నుంచి...సహజీవనం వరకు...
రామాంజనేయులు-సకినేల అరుణ పరిచయం సాన్నిహిత్యంగా మారి వీరిరువురు సత్తెనపల్లిలోని నాగన్నకుంటలో సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అప్పటినుంచి అరుణ పోషణ బాధ్యతలన్ని రామాంజనేయులు చూస్తున్నాడు.

ఊరు మారింది...పేచీ వచ్చింది...
నాలుగు నెలల క్రితం నుంచి సకినాల అరుణ సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్లకు మకాం మార్చి అక్కడ సూపర్బజారులో పనిచేస్తుంది. దీంతో రామాంజనేయులు పిడుగురాళ్ల వెళ్లి అరుణను తనతో వచ్చేయాలని కోరాడు. అయితే అరుణ ఇక తనతో సంబంధాన్ని మానుకోవాలని అరుణ అతడితో చెప్పింది.

అనుమానం...దాడి...తాను కూడా...
అరుణ మాటలు రామాంజనేయులిలో అనుమానాన్ని రేపాయి. అరుణ తనను వదిలించుకొని మరొకరితో ఉంటోందని, అందుకనే తనతో అలా మాట్లాడుతోందని భావించాడు. ఆ తర్వాత ఆమెను మాటల్లో పెట్టి సత్తెనపల్లిలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాక ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో రామాంజనేయులు కత్తితో దాడి చేసి అరుణ ముఖం, గొంతు, చేతులపై తీవ్రంగా గాయపర్చాడు. తర్వాత తాను కూడా ఎడమచేతిపై పొడుచుకొని గాయపర్చుకున్నాడు.

ఆస్పత్రికి తరలింపు...పోలీసు కేసు...
అరుణ కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితి చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అరుణతో తాను సహజీవనం చేశానని, ఆమెకి ఎంతో సాయం చెయ్యడంతో పాటు ఇల్లు కూడా కొనిచ్చానని రామాంజనేయులు చెబుతున్నాడు. ఆమె వేరే పెళ్లి చేసుకున్నట్లు తనతో చెప్పిందని, ఆ విషయమై గొడవ జరగగా ముందుగా ఆమె తన మీద దాడి చేసిందని, దీంతో తాను బయపడి ఎదురుదాడి చేశానని రామాంజనేయులు చెబుతున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.












Click it and Unblock the Notifications