పేకాటవద్దన్నందుకు కత్తితో వ్యక్తి దాడి: భార్య, కొడుకు మృతి
విజయనగరం: పేకాట వద్దని చెప్పిందనే కోపంతో భార్య, పిల్లలపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో భార్య గంగమ్మ (37), కుమారుడు నవీన్ (12) మృతి చెందారు. ఆ తర్వాత గంటి వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జిఎస్ పురంలో జరిగింది.
ఈ ఘటనలో పెద్ద కుమారుడు ప్రవీణ్ విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జీఎస్ పురానికి చెందిన వెంకటరమణ ఎలక్ట్రికల్ పనులు చేసి వచ్చే డబ్బంతా పేకాటకే ఖర్చు చేసేవాడు. జూదానికి బానిసైన భర్తను గంగమ్మ నిలదీయడంతో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. భార్యపై కోపం పెంచుకున్న వెంకటరమణ కుటుంబాన్నే అంతమొందించాలని పథకం వేశాడు.

ఆదివారం సాయంత్రం పకోడి, పండ్ల రసాల్లో మత్తుమందు కలిపి కుటుంబ సభ్యులకు తాగించాడు. ఆ తర్వాత కత్తితో ముగ్గురి పీకలను కోసేయగా భార్య, చిన్న కొడుకు మృతి చెందారు. తర్వాత వెంకటరమణ ఊరు పొలిమేరలోకి వెళ్లి వైరుతో చెట్టుకు ఉరేసుకున్నాడు.
కాగా మత్తు నుంచి తేరుకున్న పెద్ద కుమారుడు ప్రవీణ్ గొంతు దగ్గర గాయంతో బయటకు వచ్చి కొందరి నిద్రలేపి సైగలతో తండ్రి చేసిన దారుణాన్ని చూపించాడు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను చికిత్స కోసం విశాఖకు తరలించారు.












Click it and Unblock the Notifications