సోనియాకు బెయిల్: తిరుమలేశుడికి వేలు కానుక, అంబరీష్ అభినందన
బెంగళూరు: మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచారుడికి గురుదక్షిణ కింద తన బొటన వేలిని కోసి ఇచ్చిన కథ అందరికీ తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బెయిలు లభించినందుకు కర్ణాటకలో ఓ ఆధునిక ఏకలవ్యుడు తన చిటికెన వేలును నరికి తిరుపతి వెంకటేశ్వరుడికి కానుకగా ఇచ్చుకున్నాడు.
బెంగళూరు సమీపంలోని రామనగరకు చెందిన ఇందువల సురేశ్ అనే 35 ఏళ్ల యువకుడు గత నెల 25న తిరుపతి వెంకన్న ఆలయానికి వెళ్లి తన చిటికెన వేలును వెయ్యి రూపాయల నోటులో చుట్టి ఆలయంలోని హుండీలో వేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక రాసింది.
"మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఉండింది. అందుకే నేను ఈ కేసులో సోనియా, ఆమె కుమారుడు రాహుల్కు బెయిలు లభిస్తే నా చిటికెన వేలును కానుకగా ఇస్తానని మొక్కుకొన్నా" అని సురేశ్ చెప్పాడు.
ఈ వార్త కాస్తా కర్నాటక హౌసింగ్ మంత్రి ఎంహెచ్ అంబరీష్ చెవిన పడింది. దాంతో ఆయన సురేశ్ను జెపి నగర్లోని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు.