స్నేహితుడు చిరంజీవిని జంతువుగా భావించి తుపాకీతో కాల్చిన కృష్ణప్ప
చిత్తూరు: అడవిలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి ఓ యువకుడు మరణించిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పలమనేరు మండలం దిగువమారుమూరు అడవి ప్రాంతంలో వేటకు వెళ్లిన కృష్ణప్ప చేతిలో నాటు తుపాకి పేలింది.
ఈ ఘటనలో అతని స్నేహితుడు చిరంజీవి అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇరువురు స్నేహితులు వేటకు వెళ్లారు.
కానీ రాత్రిపూట కావడంతో... కృష్ణప్ప.. తన స్నేహితుడి అలికిడి విని జంతువుగా భావించి తుపాకీ పేల్చాడు. దీంతో అతను చనిపోయాడు. ఈ ఘటనలో బాధితుడు చిరంజీవి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు.
లారీ-ఆటో ఢీ, ముగ్గురి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని సత్యనారాయణపురం వద్ద 16వ నంబరు జాతీయ రహదారి పైన సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి వున్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. భీమడోలు మండలం గుండుగొలను నుంచి ఆటోలో చేపల ప్యాకింగ్కు బయలుదేరి వెళుతుండగా సత్యనారాయణపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలి ప్రభాకర్ రావు(40), మరదాని రాము(42), సప్పా శ్రీనివాసరావు(45)లు మృతి చెందారు.
మరో నలుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దెందులూరు ఎస్సై వెంకట సుభాష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.