ప్రేయసి భర్తను చంపేసి వ్యక్తి పరారీ, పెళ్లికి ముందు నుంచే....
ఓ వ్యక్తి తన ప్రేయసి భర్తను చంసేసి పరారయ్యాడు. పెళ్లికి ముందు నుంచే ఆమెకు ఆటో డ్రైవర్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు: ప్రేయసి భర్తను ఓ వ్యక్తి హతమార్చిన సంఘటన గుంటూరు జిల్లా మండల కేంద్రమైన కొల్లిపర ఎస్సీ కాలనీలో జరిగింది. కొల్లిపరకు చెందిన నూతక్కి దీనప్రసాద్ (30)కు అమృతలూరు గ్రామానికి చెందిన సౌజన్యతో పదేళ్ల క్రితం పెళ్లయింది.
వారికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. పెళ్లికాక ముందునుంచే అమృతలూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సజ్జా నాగరాజుతో నూతక్కి దీనప్రసాద్ భార్యకు వివాహేతర సంబంధం ఉంది. బుధవారం అర్థరాత్రి సమయంలో నాగరాజు సౌజన్య ఇంటికి వచ్చాడు. ఈ నేపధ్యంలో దీనప్రసాద్, నాగరాజు ఘర్షణ పడ్డారు.
నాగరాజు కత్తితో దీనప్రసాద్ను గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావమైన దీనప్రసాద్ ఆ వెంటనే మృతి చెందాడు. దీనప్రసాద్ తల్లి నాగమ్మ కొల్లిపర పోలీస్స్టేషన్లో పిర్యాదు చేయగా డీఎస్పీ వెంకటరమణమూర్తి, సీఐ చినమల్లయ్య, దుగ్గిరాల ఎస్ఐ మురళి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.