బైక్ పైనుంచి తోసేసి: ప్రియురాలి మోజులో, భార్యపై భర్త హత్యాయత్నం
కడప: ప్రియురాలి పైన మోజుతో గర్భవతి అయిన భార్య పైన ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఆమె బంధువుల సాయంతో భర్త చెర నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన కడప జిల్లాలోని పోరుమామిళ్ల మండలంలో చోటు చేసుకుంది.
చిన్నాయిపల్లె గ్రామానికి చెందిన సావిత్రికి, బద్వేలు ప్రాంతానికి చెందిన నాగేంద్రతో పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. బాధితురాలు ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. అయితే నాగేంద్ర బద్వేలులో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ప్రియురాలిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పుట్టింటిలో ఉన్న సావిత్రిని శుక్రవారం సాయంత్రం బైక్ పైన ఎక్కించుకొని మార్గమధ్యలో వాహనంపై నుంచి తోసేసి చంపే ప్రయత్నం చేశాడు.
బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. ఆ సమయంలో కొందరు ఆమె కేకలు విని సాయం చేశారు. ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.