ఏపీలో తిరిగాలంటే వీసా కావాలా?: చంద్రబాబుపై మందకృష్ణ నిప్పులు
అమరావతి: ఏపీలో తిరగాలంటే వీసా కావాలా ఇదేమన్నా పాకిస్తానా లేక పరాయి దేశమా? అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో మీడియా సమావేశం పెట్టేందుకు బయల్దేరిన ఆయన్ను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కృష్ణా జిల్లా సరిహద్దు గరికపాడు వరకూ పోలీస్ వాహనంలో తీసుకువచ్చి సరిహద్దు దాటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న వేళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున దగ్గరుండి రక్షణగా నిలిచామని, ఇప్పుడు తమను అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
బాబుకు రక్షణగా నిలిచినందుకు తమకు ఇచ్చిన బహుమానం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో మీడియా సమావేశం పెట్టేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మహానాడులో 28 తీర్మానాలు చేసిన టీడీపీ చిరకాల హామీ అయిన ఎస్సి వర్గీకరణను విస్మరించిందన్నారు.
దీంతో పాటు రాజ్యసభలో ఎస్సిలకు ఒక సీటు కేటాయించాలని అడిగేందుకు విజయవాడ బయల్దేరిన తనను పోలీసులు ప్రజాస్వామ్య విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎస్సి వర్గీకరణను పూర్తిగా విస్మరించి మాల నాయకులైన జూపూడి ప్రభాకరరావు, కారంపూడి శివాజీకి ఎస్సి, ఎస్టి చైర్మన్ పదవులు కట్టబెట్టారన్నారు.
తమకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సి వర్గీకరణ ఇంతవరకూ చేయలేని సిఎం మహానాడులో ప్రవేశపెట్టిన 28 తీర్మానాలు ఎలా అమలు చేయగలరని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎస్సి వర్గీకరణ జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.