హోదాపై ప్రధానిగా చెప్పా: మోడీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన మన్మోహన్
అనంతపురం: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే అయిదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము అంగీకరించామని, ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం అన్నారు.
అనంతపురం బండ్లపల్లి సభలో మన్మోహన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని తాము చెప్పామని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బిజెపి మాత్రం ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చామన్నారు.
యూపీఏ హయాంలో సోనియా గాంధీ చొరవ వల్లే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. పేదరిక నిర్మూలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తోందన్నారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక ఆహార భద్రత, ఉపాధి హామీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు.
100 రోజులు పని కల్పించేలా 2006లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. తాను ప్రధాని హోదాలో ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చానని చెప్పారు. అంతకుముందు రాహుల్ గాంధీ ఉపాధి కూలీలతో సహపంక్తి భోజనం చేశారు.