కరోనాతో ఎంతో మంది జీవనోపాది కోల్పోయారు.!ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలన్న నందమూరి బాలకృష్ణ.!
హిందూపురం/హైదరాబాద్: కరోనా రెండో దశ అత్యంత ప్రమాదకరంగా పరిణమించి అనేక కుటుంబాలతో చెలగాటం ఆడుకుంటోందని, కరోనా ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను తీసి వారి బతుకులను ఛిద్రం చేసిందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను, భౌతిక దూరం పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లు, కావలసినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి, కలెక్టర్ డీఎం అండ్ హెచ్ఓతో మాట్లాడానని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆక్సిజన్ అందక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు బాలకృష్ణ.ఇదిలా ఉండగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని నందమూరి బాలకృష్ణ ఏపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త లేకపోవడమే కాకుండా సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడం, అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
కోవిడ్ ఆస్పత్రుల్లో బాధితులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఘాటుగా విమర్శించారు బాలయ్య. ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, రాష్ట్రంలో ఎటు చూసిన చావు కేకలు వినిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.
Recommended Video