మంత్రి అయ్యన్నకు మావోల బెదిరింపు లేఖ?: టీడీపీలో కలకలం, పోలీసులు అప్రమత్తం
విశాఖపట్నం: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను తొలినుంచీ మావోయిస్టులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి మావోయిస్టుల నుంచి బెదిరింపుల లేఖ వచ్చిందంట.
బాక్సైట్ తవ్వకాలకు ఏపీ సర్కారు ఇచ్చిన అనుమతులను నిరసిస్తూ మావోలు మంత్రికి ఘాటు లేఖ రాశారని సమాచారం. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ మంత్రి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని సదరు లేఖలో అయ్యన్నపాత్రుడికి మావోలు సూచించారు.
తమ సూచన మేరకు రాజీనామా చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవువతాయని ఆ లేఖలో మావోయిస్టులు బెదిరించారు. ఈ లేఖపై మంత్రి అయ్యన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని అధికార నేతలు, ప్రజా ప్రతినిధులను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి అయ్యన్నకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారన్న కథనాలు వెలువడం అధికారులను కలవరపెడుతోంది. తాజాగా అయ్యన్నకు లేఖతో విశాఖలో ఎప్పుడేం జరుగుతుందా? అన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయ్యన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏజెన్సీలో మావోల కదలికలున్నాయని నిర్ధారించారు.
మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయ్యన్నకు సూచించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లరాదని కూడా పోలీసులు మంత్రిని కోరారు. అయితే, మావోల బెదిరింపు లేఖ అంశాన్ని మంత్రి అయ్యన్న కొట్టిపారేశారు. ఇప్పటికే బాక్సైట్ కేటాయింపులపై విశాఖ మన్యంలో టీడీపీకి చెందిన ముగ్గురు మండల స్థాయి నేతలను అపహరించారు.