'140 సీట్లలో జగన్ గెలుపు': పంచాంగంలో ఎవరికి వారే
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 140 నుంచి 145 సీట్లు వస్తాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్ర శాస్త్రి జోస్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారేపల్లి పంచగ శ్రవణం చేశారు. జగన్ పార్టీకి జయనామ సంవత్సరంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిరు. 140 నుంచి 145 స్థానాల వరకు గెలుస్తారని తెలిపారు.
గ్రహగతులన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగుంటాయని తెలిపారు. పార్టీ ముఖ్యనాయకులు పంచాంగ శ్రవణం చేశారు. ఇతర పార్టీల కార్యాలయాల్లోను పంచాంగ శ్రవణం వినిపించారు. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరా భవన్లో జరిగిన పంచాంగ శ్రవణంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, మాజీ మంత్రులు సి రామచంద్రయ్య, డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ సీనియర్ నాయకుడు ఎం సత్యనారాయణ రావును వారు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రాష్ట్రంలో ఒడిదుడుకులు ఎదురైనా, సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పంచాంగకర్త తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఉగాది పచ్చడి రుచి తరహాలో మనిషి జీవితం ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో మాజీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఎం సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని శాస్త్రి తెలిపారు. ఆ తర్వాత శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ టిడిపి-బిజెపి కలిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెరాస అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
రాజు, మంత్రి చంద్రుడే కావడంతో ప్రజలకు మేలు కలుగుతుందని పొన్నులూరి శ్రీనివాస గార్గేయ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సోమవారం ఉదయం జరిగిన పంచాంగ శ్రావణం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస గార్గేయ పంచాంగం వినిపిస్తూ, ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. రాజు, మంత్రి చంద్రుడు ఒక్కరే కావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.