మంగళగిరి రూపురేఖలు మారుస్తున్న లోకేష్.. నిధుల వరద!
ఏపీలో మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. తనకు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన మంగళగిరి వాసులకు మౌలిక వసతుల కల్పనకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధుల నుండే కాదు వివిధ కేంద్ర నిధులను కూడా మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయించేలా చొరవ చూపుతున్నారు.
మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర నిధులు
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మంగళగిరి-తాడేపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ' ఇందులో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంజూరు చేసిన నిధులు రూ. 497.71 కోట్లు ఉన్నాయి.

రూ. 1,167.50 కోట్ల రూపాయలతో అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్
ఈ ప్రాంతంలో అత్యాధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ఫేజ్-1 మరియు ఫేజ్-2 పనుల కోసం కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇందులో కొంత మేర నిధులు హడ్కో రుణాల ద్వారా కూడా సమకూరుస్తున్నారు.రూ. 1,167.50 కోట్ల రూపాయలతో ఈ భారీ ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఈ నిధులతో మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించనున్నారు.
33వేల ఇళ్ళకు మేలు చేసేలా భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ
మంగళగిరి-తాడేపల్లిలో సుమారు 33వేల ఇళ్లకు మేలు చేసేలా భారీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకురానున్నారు మంత్రి లోకేష్. 303కిలోమీటర్ల పొడవైన నెట్వర్క్తో పాటు రోజూ 26.68 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 6 STPలను ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఇది మాత్రమే కాక రూ. 450.24 కోట్లను నగరవ్యాప్తంగా, కొత్తగా విలీనమైన 15కు పైగా గ్రామాల్లో 24గంటల తాగునీటి సరఫరా గ్రిడ్ కోసం కేటాయించారు.
రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇలా
అమృత్ 2.0 పథకం కింద రూ. 51.20 కోట్లు మంగళగిరికి కేటాయించారు. అదనపు విలీన గ్రామాల పైప్లైన్ల కోసం CRDA ద్వారా రూ. 111.50 కోట్లు నిధులు ఇచ్చారు.రూ. 137 కోట్లు కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డులలో 102 సీసీ రోడ్లు, 94 సీసీ డ్రైన్లు, మరియు 67 బీటీ రోడ్ల నిర్మాణాల కోసం కేటాయించబడ్డాయి.
రూ. 3,500 కోట్లకు పైగా విలువైన పనులు.. లోకేష్ ఫోకస్
మున్సిపల్ కార్పోరేషన్ రూ. 1785 కోట్ల వార్షిక బడ్జెట్ కలిపి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక ప్రాజెక్ట్ నిధులు అన్నీ కలుపుకొని దాదాపు రూ. 3,500 కోట్లకు పైగా విలువైన పనుల ప్రణాళికలు మంగళగిరి తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలో నడుస్తున్నాయి. మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో వేల కోట్ల నిధులు కేటాయించి నగర రూపు రేఖలు మారుస్తున్నారు.












Click it and Unblock the Notifications