కేసీఆర్కు స్టీఫెన్ రూ.కోటి, బాబుని ఇరికించాలని బెదిరింపు: మత్తయ్య
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంలో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. అతను విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసు స్టేషన్లో బుధవారం నాడు కేసీఆర్ పైన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా అతను తీవ్ర ఆరోపణలు చేశారు. స్టీఫెన్ సన్ను ఎమ్మెల్సీగా చేసేందుకు కేసీఆర్ అతని నుండి రూ.కోటి తీసుకున్నారని ఆరోపించారు. స్టీఫెన్ అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. అతను దీర్ఘకాలిక రుణం కోసం తిరుగుతున్నాడని చెప్పారు.
తెరాస నాగార్జున సాగర్ శిబిరం నుండి స్టీఫెన్ సన్ను గెంటివేశారన్నారు. అప్పుడే తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. సెబాస్టియన్తో స్టీఫెన్ చర్చించారని చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రాణభయంతో తిరుగుతున్నానని చెప్పారు.
తన తమ్ముడిని హైదరాబాద్ పోలీసులు చితక్కొట్టారని ఆయన ఆరోపించారు. తన భార్యా పిల్లలను అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. నోటుకు ఓటు కేసులో చంద్రబాబును ఇరికించాలని తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు.
మత్తయ్య ఫిర్యాదు మేరకు సత్యనారాయణ పురం పోలీసులు ఐపీసీ 506, 507, 387 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. స్టీఫెన్ నుండి కేసీఆర్ రూ.కోటి తీసుకున్నట్లు మత్తయ్య ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు మరో మలుపు కూడా తిరుగుతోంది.