మేయర్ అనురాధ హత్య: ఇన్నాళ్లు చింటూ అక్కడే ఉన్నాడా? లేఖపై ఆరా
చిత్తూరు: మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలోనే గడిపినట్లుగా తెలుస్తోంది. కార్పోరేషన్ కార్యాలయంలో వారిని హత్య చేసిన 5గురు పథకం ప్రకారమే బయటకు వచ్చారని చెబుతున్నారు.
ముగ్గురు పోలీసు స్టేషన్ వైపుగా ఆటోలో వెళ్లారు. మరోవైపు, అప్పటికే మురుగా అనే వ్యక్తి కారుతో సిద్ధంగా ఉన్నాడు. మురుగాతో చింటూ, అతని డ్రైవర్ వెంకటేష్లు గంగాధర నెల్లూరు వైపుగా వెళ్లాడని తెలుస్తోంది. అక్కడి నుంచి తిరుత్తణి వరకు వెళ్లిన కారులో మురుగా తిరిగి వచ్చేశాడు.
చింటూ, వెంకటేష్లు తమిళనాడుకు వెళ్లారని తెలుస్తోంది. ఆ తర్వాత తమిళనాడులో కొన్ని రోజులు, కర్నాటకలో కొన్ని రోజులు తలదాచుకున్నాడు. కొద్ది రోజులు చిత్తూరుకు చెందిన సన్నిహితుల వద్ద ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. చింటూ ఎప్పటికప్పుడు పరిస్థితిపై తెలుసుకునేవాడు.
హత్య కేసుపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం, పోలీసులు వెతుకుతుండటంతో ప్రాణభయంతో లొంగిపోతానని లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. కాగా, మేయర్ దంపతులను హత్య చేసింది చింటూనే అని పోలీసులు, కోర్టులో లొంగిపోయిన వారు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయం తెలిసిందే.
చింటూ చాలారోజుల పాటు రెక్కీ నిర్వహించి ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇలా పలు కోణాల్లో చింటూనే నిందితుడంటూ తెలిసినా, తనకు మేయర్ దంపతుల హత్యతో సంబంధంలేదని లేఖ రాయడం గమనార్హం. చింటూ లేఖ గురించి ఆరా తీస్తుండగానే అతను లొంగిపోయాడు.
అతను ఎందుకు లేఖ రాశాడనే విషయమై పోలీసులు ఆరా తీసే ప్రయత్నాలుచేస్తున్నారు. ఆ లేఖ రాయడం వెనుక చింటూ వ్యూహం ఏమిటి? అలా రాయడం ద్వారా చింటూకు ఏం లాభం? ఎవ్వరిని పక్కదారి పట్టించడానికి రాశాడు? అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.