విద్యాశాఖలో దళారుల దందా:రూ. 5 లక్షలిస్తే చాలు...మీకోసం జీవోనే ఇప్పిస్తాం
అమరావతి:ప్రభుత్వం ఎంత జాగ్రత్త వహించినా వివిధ రంగాల్లో దళారుల దందాలకు మాత్రం బ్రేకులు వేయలేకపోతోంది. ఇటీవలే సర్వశిక్షా అభియాన్ లో పొరుగు సేవల ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దళారులు లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడటంతో ఏకంగా ఆ పోస్టులనే నిలిపివేసింది ప్రభుత్వం.
అదే క్రమంలో తాజాగా విద్యాశాఖలో చోటు చేసుకున్న మరో భాగోతం ప్రభుత్వాన్ని తీవ్రంగా అప్రతిష్ట పాలుచేస్తోంది. విద్యాశాఖ కు సంబంధించిన ఒక నూతన కోర్సు నిర్వహణ కోసం ఇటీవలే కొన్ని కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఆ అనుమతులు ఇప్పించింది తామేనని, 5 లక్షల రూపాయలు ఇస్తే మీ కాలేజీకి కూడా ఆ అనుమతులు ఇప్పిస్తామంటున్నారు దళారులు...అంతేకాదు...ఇందుకోసం ఏకంగా ప్రభుత్వ జీవో నే ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. దీన్ని బట్టే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇంటిగ్రేటెడ్ కోర్సు...అనుమతులు
రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులను నిర్వహించుకునేందుకు ఆరు ప్రైవేట్ బీఈడీ కాలేజీలకు అనుమతిస్తూ ఇటీవలే ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఆ తరువాత ఇక దళారుల దందా మొదలైంది. ఆ కాలేజీలకు తామే అనుమతులు ఇప్పించామంటూ రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల మేనేజ్మెంట్లపై వల విసురుతోంది. కారణం ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సుల అంశంలో కొన్ని కళాశాలలకు అనుమతులు రావడమే ఈ దళారులకుకు అవకాశంగా మారిందంటున్నారు.
మీక్కూడా...కావాలంటే...ఏకంగా జీవో
మీక్కూడా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సుల నిర్వహించుకుంటారా?...అలా నిర్వహించుకునేందుకు అనుమతి కావాలంటేమాకు రూ.5 లక్షలిస్తే చాలు...మీకు అనుమతి వచ్చేస్తుంది. అంతేకాదు ఇందుకోసం ఏకంగా జీవో నే ఇప్పిస్తామంటూ వీళ్లు బీఈడీ కాలేజీల మేనేజ్మెంట్లకు హామీ ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలోని పలు ప్రైవేట్ డిగ్రీ, బీఈడీ కాలేజీల నిర్వాహకుల్లో కొందరే ఇలా దళారుల అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని బీఈడీ కాలేజీల మేనేజ్మెంట్ల నుంచి ఈ రకంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. వీరికి ఉన్నత విద్యాశాఖలోని కొందరు సిబ్బంది సహకరిస్తున్నారంటున్నారు.
ఫ్లాష్ బ్యాక్ కు...వెళితే.
రాష్ట్రంలో ఈ కోర్సును నిర్వహించుకునేందుకు ఎన్సీటీఈ 2015-16 విద్యా సంవత్సరంలోనే 33 కాలేజీలకు అనుమతిచ్చింది. కానీ అది ఇంతవరకు అమలు కాలేదు. కారణం రాష్ట్రంలో ఈ కోర్సుకు సంబంధించిన సిలబస్ రూపకల్పనకు ఉన్నత విద్యామండలి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ డ్రాఫ్ట్ సిలబ్సను రూపొందించినా ఇప్పటి వరకు దానికి అనుమతి రాలేదు. ఫలితంగా ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఆ క్రమంలోనే అటానమస్ డిగ్రీ కాలేజీలకు, నాక్ అక్రెడిటేషన్ కలిగిన డిగ్రీ కాలేజీలకు మాత్రమే ఈ కోర్సుల నిర్వహణకు అనుమతివ్వాలని అప్పట్లో నిర్ణయించారు. రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును సీబీసీఎస్ విధానంలో నిర్వహిస్తుండటం, డిగ్రీ కాలేజీల్లో మాత్రమే మౌలిక సదుపాయాలు, ల్యాబ్లు ఉన్నందున ఈ అభిప్రాయానికొచ్చారు.
ఆచితూచి స్పందించాలి...కానీ విస్మరించారు
ఐదు సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీ, బీఈడీ చదువును నాలుగేళ్లకు కుదించి ఒకే కోర్సుగా మార్చాల్సి రావడంతో సిలబస్ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని భావించారు. కానీ ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ ఆ విషయాన్ని విస్మరించి ఏ విధమైన అధ్యయనం లేకుండా, మౌలిక సదుపాయాలు చెక్ చేయకుండా ఏకంగా ప్రైవేట్ బీఈడీ కాలేజీలకు ఇలా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. సిలబస్ లేకుండా...బీఎడ్ కాలేజీల్లో ల్యాబ్స్, మౌలిక సదుపాయాలు లేకుండా వర్సిటీలు ఆయా కాలేజీలకు అఫిలియేషన్ ఎలా ఇస్తాయన్న దానిపై స్పష్టత లేదు. 2018-19 విద్యా సంవత్సరంలో ఆయా కోర్సులను ఎలా నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. దీంతో తాజా ఉత్తర్వులపై గందరగోళం పరిస్థితులు ఉండగానే మరోవైపు దళారులు దందాకు దిగడం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చగా పరిణమిస్తున్నాయి.