నాగబాబు నియోజకవర్గం ఫిక్స్ - రఘురామకు హామీ: లెక్క ఇలా..
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. రెండు పార్టీల అధ్యక్షుల భేటీతో పొత్తు పైన దాదాపు క్లారిటీ వచ్చింది. దీంతో రెండు పార్టీల నుంచి ముఖ్య నేతలు పోటీ చేసే సీట్ల గురించి చర్చ సాగుతోంది. జనసేన నేతలు నాగబాబు..నాదెండ్ల మనోహర్ స్థానాలు ఖరారైనట్లు చెబుతున్నారు. నాగబాబు ఈ సారి పోటీకి విముఖంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ, నాగబాబు రానున్న ఎన్నికల్లో పోటీ చేయటం ఖరారైందని తాజాగా పార్టీ నేతల సమాచారం. దీంతో పాటుగా వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవంటా దాదాపు ఖాయమైంది.

ఎంపీగా నాగబాబు - సీటు ఖరారైనట్లేనా
మెగా బ్రదర్ నాగబాబు 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రఘురామ రాజు గెలుపొందారు. ఈ సారి పార్టీ కోసం పని చేస్తానని.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో నాగబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు జనసేన ఏపీలో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీకి సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైజాగ్ లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని జనసేన నేతల్లో ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ లోక్ సభ స్థానానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విశాఖ లో జనసేనకు 2,88,874 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్ధి భరత్ కు 4,32,492 ఓట్లు రాగా, ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్దికి 4,36,906 ఓట్లు వచ్చాయి. ఈ సారి పొత్తు కారణంగా జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్దికి గెలుపు ఖాయమనే లెక్కలు వేస్తున్నారు. అక్కడ నందమూరి బాలయ్య అల్లుడు రేసులో ఉన్నారు. జనసేనకు ఎంపీ సీటు కేటాయిస్తే, భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రఘరామకు హామీ దక్కిందా..
వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామ రాజు తిరిగి తన నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ -జనసేన మైత్రిని ఆయన ఆహ్వానించారు. బీజేపీ కూడా వీరిద్దరితో కలిసే అవకాశం ఉందని అంచనాలు వెల్లడించారు. అటు చంద్రబాబు..ఇటు పవన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న రఘురామ తిరిగి నర్సాపురం నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. తాను అక్కడి నుంచి తిరిగి తెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నర్సాపురంలో జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబుకు 2,50,289 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన శివరామ రాజుకు 4,15,685బ ఓట్లు రాగా, రఘురామ రాజుకు 4,47,594 ఓట్లు దక్కాయి. ఇప్పుడు టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ రెండు పార్టీల ఓట్లు కలిస్తే గెలుపు ఖాయమని రఘురామ ధీమాకు కారణంగా కనిపిస్తోంది. అయితే, రఘురామ జనసేన అభ్యర్ధిగానే బరిలో నిలబడే అవకాశం ఉందని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications