ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి ఖరారు..!!
మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుంది. జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎన్నికల్లో పని చేసారు. తొలుత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని భావించినా..పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఆ తరువాత నాగబాబుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ, పవన్ ఖండించారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల పైన కసరత్తులో భాగంగా నాగబాబుకు ఇవ్వాల్సిన పదవి పైన చంద్రబాబు -పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
నాగబాబుకు ప్రాధాన్యత
నాగాబాబు తాజా ఎన్నికల్లో జనసేన విజయం కోసం కష్టపడ్డారు. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేసారు. అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో వారి మద్దతు కూడగట్టంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మెగా ఫ్యాన్స్ ను ఏకం చేసి వారి మద్దతు సంపాదించారు. కాపు సామాజిక వర్గాలతోనూ సమావేశాలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మాత్రమే జనసేన విజయం కోసం పూర్తి స్థాయిలో పని చేసారు. దీంతో, నాగబాబుకు కొత్త ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కనుంది.

పదవి పై చర్చలు
నాగబాబును రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. అయితే, రాష్ట్రం నుంచి ప్రస్తుతం రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు. 2026లో రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ లోగా వైసీపీ నుంచి ఎవరైనా కూటమిలోకి మారి..తమ పదవికి రాజీనామా చేస్తే నాగబాబుకు అవకాశం దక్కనుంది.దీంతో, ముందుగా ప్రభుత్వంలోనే నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. తాజాగా నామినేటెడ్ పదవుల పైన చంద్రబాబు - పవన్ సుదీర్గ కసరత్తు చేసారు. మూడు పార్టీలకు పదవుల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చారు.
మెగా బ్రదర్ కు పదవి
నాగబాబుకు ఫిలిం డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇవ్వటం పైనా చర్చ జరిగినా..ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సినీ రంగం..ఇటు ప్రభుత్వంలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా నాగబాబుకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీలో సినీ పరిశ్రమను విస్తరించేలా బాధ్యతలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబుకు ఈ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నాగబాబుకు దక్కే పదవి పైన అధికారికంగా నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications