చిత్తూరు జిల్లాలో పుట్టారు, ఇదేమిటి: బాబుపై మేకపాటి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలుగు ప్రజలు క్షమించరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించడమేంటని ఆయన ప్రశ్నించారు.
తెలుగు ప్రజలందరికి ఒక రాష్ట్ర ఉండాలని అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను త్యాగం చేశారని మేకపాటి అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణ తన ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్నారని ఆయన చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడం సరికాదని ఆయన అన్నారు. ఢిల్లీ పెద్దలు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారని, అంతేగాక కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టారని ఆయన అన్నారు. వైయస్ చేసిన సహాయాన్ని మరిచిన కేంద్రం తెలుగు ప్రజలను విడగొట్టి ఇబ్బందులు పెడుతోందని అన్నారు. సోనియా గాంధీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం లేదని అన్నారు.
ఎన్డీఏ హయాంలో రాష్ట్రాలను విభజించినప్పడు విభజన తీర్మానాలను ఆయా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయని అన్నారు. ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా రాష్ట్ర అసెంబ్లీకి తీర్మానం పంపకపోవడమేంటని అన్నారు. విశాలాంధ్రలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశారని అన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించడం సరికాదని ఆయన అన్నారు. ఆరు మాసాల్లో రాష్ట్రంలో సరైన నాయకత్వం రాబోతోందని ఆయన తెలిపారు.
ప్లకార్డులు పట్టుకున్నాడు: సుభాష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్లకార్డులను ప్రదర్శించారని ఆ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.