దారుణం: బాలికపై నెల రోజులుగా అత్యాచారం
విజయవాడ: ఓ బాలికపై ఓ వ్యక్తి నెల రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మూగ, చెవిటి మాత్రమే కాకుండా ఆమెకు మతిస్థిమితం లేదు.
బాధితురాలి తల్లి భవానీపురం పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లపూడి సారాయి కొట్టు సెంటర్లో ఓ మహిళ నివసిస్తోంది.
భర్తతో విడిపోయి ఇలా..
భర్తతో ఆమె పదేళ్ల కిందట విడిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం చేసింది. ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ మతిస్థిమితంలేని చిన్న కూతురు(17)తో కలిసి జీవిస్తోంది.
పాచి పనులు చేస్తూ ఆ ఇంట్లో అద్దెకు..
గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి చెందిన వీర్ల సాంబశివరావు(55) కూతురు గొల్లపూడిలో నివసిస్తోంది. ఆమె ఇంటిలోనే బాలికతల్లి అద్దెకు ఉంటూ, ఆ ఇంట్లో పాచిపనులు చేస్తోంది.
తల్లి ఇంట్లో లేని సమయం చూసి..
తన కూతురు ఇల్లు కడుతుండడంతో సాంబశివరావు నాలుగురోజులు ఇక్కడ ఉంటూ మూడు రోజులు స్వగ్రామంలో ఉంటున్నాడు. సాంబశివరావు నెల రోజులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడి చేస్తున్నాడు. బాలిక సైగలద్వారా తల్లికి విషయం చెప్పింది. దాంతో ఆమె సాంబశివరావును నిలదీ సింది.
ఇంట్లోంచి బలవంతంగా గెంటేశారు..
మాపైనే ఆరోపణలు చేస్తావా అంటూ వారిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.