అమరావతిలో మినీ మేకర్స్ ఫెయిర్:ఔత్సాహికుల నుంచి భారీ స్పందన
అమరావతి:సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మినీ మేకర్స్ ఫెయిర్ కు ఇన్నోవేటర్స్ నుంచి మంచి స్పందన లభించింది.
నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్రానికి మినీ మేకర్స్ ఫెయిర్ రావడం గొప్ప విషయమని మంత్రి దేవినేని ఉమ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వల్లే ఏపీకి మినీ మేకర్ ఫెయిర్ వచ్చిందని ఆయన చెప్పారు. యువతకు వారి ఆలోచన, సృజనాత్మకతే పెట్టుబడి అని మంత్రి దేవినేని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలను, ఆ విధమైన సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో మినీ మేకర్స్ ఫెయిర్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. తమ సృజనతో , మేధస్సుతో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కొత్త కొత్త వస్తువుల తయారీతో సృజన కళాకారులుగా తయారవ్వాలనేది మినీ మేకర్స్ ఫెయిర్ ఏర్పాటు వెనుక ప్రభుత్వం ఆకాంక్షగా తెలుస్తోంది.
ఇక్కడ కేవలం వస్తువుల ప్రదర్శనే కాదు విక్రయాలు కూడా జరుపుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకోసం ఇక్కడ పాల్గొనే వారికి ఉచిత ఆవాసం, ఆహారం మరియు రాకపోకల భత్యాల చెల్లింపు వంటి సదుపాయాలను సైతం ప్రభుత్వం కల్పించింది.