పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే.. తేల్చేసిన మంత్రి ఆదిమూలపు.. విద్యార్థులకు కీలక అలర్ట్..
కరోనా వైరస్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు పెద్ద డైలామాలో పడిపోయారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు.. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దీనిపై కీలక ప్రకటన చేశారు. లాక్డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్..
రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియల్ నిశాంక్ మంగళవారం(ఏప్రిల్ 28) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షల నిర్వహణపై తన ట్విట్టర్లో స్పష్టతనిచ్చారు. లాక్డౌన్ పూర్తయ్యాక పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి,భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
అప్పటివరకూ సస్పెన్స్ తప్పదు..
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అన్నది సస్పెన్స్గా మారింది. లాక్ డౌన్ పొడగించాలని పలు రాష్ట్రాలు కోరుతుండగా.. ఎగ్జిట్ స్ట్రాటజీని రూపొందించడంలో మరికొన్ని రాష్ట్రాలు బిజీగా ఉన్నాయి. లాక్ డౌన్పై కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప పదో తరగతి పరీక్షల భవితవ్యం తేలదు. కాబట్టి అంతదాకా విద్యార్థులు ఓపికగా ఎదురుచూడాల్సిందే.
సప్తగిరి ఛానెల్లో పాఠ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వం పైతరగతులకు ప్రమోట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పదో తరగతి పరీక్షలు నిర్వహించి తీరుతామని గతంలోనే స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు సార్లు పదో తరగతి పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు కూడా పరీక్షల షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొత్త షెడ్యూల్ వచ్చేంతవరకు సప్తగిర ఛానెల్ ద్వారా విద్యార్థులు పాఠాలు వినాలని మంత్రి సురేష్ విద్యార్థులకు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 4 గంటలనుంచి 5 గంటల వరకు రోజుకు రెండు గంటల పాటు సప్తగిరి చానెల్లో పాఠ్యాంశాల బోధన ప్రసారం అవుతుందన్నారు.
Recommended Video