చంద్రబాబు మనో ధైర్యం కోల్పోయారు..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. టీడీపీకి అండగా నిలవాలని జనసేన నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఆయన చేసిన ఈ ప్రకటన కాస్తా జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులకు కొరుకుడు పడట్లేదు. తాము పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంటే.. ఆయన చంద్రబాబును సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నారనే అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తమౌతోన్నాయి.

అయినప్పటికీ- ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోవట్లేదు జనసేన పార్టీ. పొత్తును మరింత ముందుకు తీసుకెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకూడనే కారణంతోనే తాను టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు.
రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉమ్మడి మేనిఫెస్టోపై ఈ రెండు పార్టీల నేతలు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి రూపొందించుకోవాల్సిన వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు సమన్వయ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.
ఈ భేటీపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత ఈ రెండు పార్టీలకు రాజకీయాలే ప్రధానం అయిపోయాయని, ఎప్పుడూ పొత్తుల గురించే మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అభిమానుల రూపంలో ఈ గడ్డపై ఇంకా నరకాసులు చాలామందే ఉన్నారని ఆరోపించారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. దసరా పండగను పురస్కరించుకుని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేయాలంటూ టీడీపీ పిలుపునిచ్చిన కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయిందని అన్నారు. రాజమండ్రిలో సమావేశం కూడా అట్టర్ ప్లాప్ షోనేనని చెప్పారు.

పవన్ కల్యాణ్ విధానాలు ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదని, 2014లో తెలుగుదేశం, 2019లో వామపక్షాలు- బీఎస్పీతో, ఇప్పుడు మళ్లీ టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారంటే పవన్ కల్యాణ్ చేసే రాజకీయాలు నిలకడ లేనివనే విషయం అర్థమౌతుందని అంబటి రాంబాబు చెప్పారు. అందుకే ఆయనను అందరూ ప్యాకేజీ స్టార్ అని పిలుస్తారని చెప్పారు.
టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసమే జనసేన పుట్టిందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడానికి రాజమండ్రిలో సమావేశం పెట్టామని పవన్ కల్యాణ్ చెప్పారని, అంటే చంద్రబాబు మనోధైర్యం కోల్పోయినట్టేనని అంగీకరించినట్టేనా అని ప్రశ్నించారు.
ఏ తప్పూ చేయకపోతే 42 రోజుల పాటు చంద్రబాబును జైల్లో పెట్టడం సాధ్యమా? అని అంబటి రాంబాబు అన్నారు. సాక్షులను తారుమారు చేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వట్లేదని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఈ దేశంలోనే నెంబర్ వన్ చంద్రబాబు అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications