బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో.. బాలకృష్ణ ఇదే సరైన సమయం: అంబటి రాంబాబు సలహా!!
టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మంత్రి అంబటి రాంబాబు మరోమారు టార్గెట్ చేశారు . నందమూరి బాలకృష్ణ మీసం తిప్పాల్సింది అసెంబ్లీలో కాదని, తెలుగుదేశం పార్టీలో అంటూ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. తాము చంద్రబాబు అవినీతిపై ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు పేర్కొన్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తప్పితే ఉపయోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అరెస్టుపై సరైన ఫార్మాట్ లో రాకుండా టిడిపి నేతలు గందరగోళం సృష్టించారని, చంద్రబాబు అవినీతిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశం చర్చ కాదని, రచ్చ అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

ఎవరి వాదన వారు వినిపిద్దామని పేర్కొన్న మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు అవినీతి చేయలేదని నమ్మకం ఉంటే, చంద్రబాబు తప్పు చేయలేదని నిజంగా నమ్మితే పారిపోకుండా చర్చలో పాల్గొనాలని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం బాలకృష్ణ యాక్టివ్ గా ఉన్నాడని, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మరీ మీసం తిప్పారని, అయితే బాలకృష్ణ మీసం తిప్పాల్సింది తెలుగుదేశం పార్టీలో అని మంత్రి అంబటి రాంబాబుపేర్కొన్నారు.
మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు టిడిపిలో మీసం తిప్పాలని హితవు పలికారు. తండ్రికి కష్టకాలంలో సహాయ పడలేదన్న అపవాదు మీ సోదరుల పైన ఉందని, ఇప్పుడు ఆ అపవాదు తొలగించుకునే అవకాశం వచ్చిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారు.. మీకు సరైన సమయం చేతిలో నుంచి జారిపోయిన పగ్గాలు తిరిగి తీసుకోండి నందమూరి వంశాన్ని నిరూపించుకోండి అంటూ అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడానికి ఇదే సరైన సమయమని, పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నాను అని పేర్కొన్నారు అంబటి రాంబాబు. తాను చెప్పింది పాటించకపోతే అదః పాతాళానికి పడిపోతారని అంబటి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications