మోకా హత్య... కొల్లు అరెస్ట్... చంద్రబాబు బీసీ 'కార్డు'కు మంత్రి అనిల్ అదిరిపోయే కౌంటర్...
వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుకు సంబంధించి అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వైసీపీ బీసీ నేతలపై కక్ష కట్టిందని టీడీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీలోని బీసీ నేతలే టీడీపీకి కౌంటర్ ఇస్తున్నారు. తప్పు చేసినవారికి కులం,మతం అంటకట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

మోకా బాస్కర్ రావు కూడా బీసీనే...
బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. నేరానికి పాల్పడ్డవారిపై కేసులు పెట్టరా అని మండిపడ్డారు. హత్యకు గురైన మోకా భాస్కర్ రావు కూడా బీసీనే అని కౌంటర్ ఇచ్చారు. ఆయన హత్యతో ఆ కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. రూ.150 కోట్లు స్కామ్ చేసిన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలకు చంద్రబాబు ఏం చేశారు...
అయ్యన్నపాత్రుడి మాటలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తుకు వస్తోందని అనిల్ ఎద్దేవా చేశారు. అయ్యన్న ఓ మహిళపై చేసిన అసభ్య వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినవాళ్లకు కులాన్ని అంటగట్టడం టీడీపీకి అలవాటేనని అన్నారు. బీసీలపై కక్ష కట్టారని ఆరోపిస్తున్న చంద్రబాబు... టీడీపీ హయాంలో అసలు వారికేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రూ.50వేల కోట్లు బీసీల కోసం ఖర్చు పెడుతామని చెప్పి కనీసం రూ.15వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు.

బీసీల కోసం జగన్ రూ.20వేల కోట్లు...
బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని మంత్రి అనిల్ ఆరోపించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బీసీల అభివృద్ది కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పారు. కేవలం ఏడాది కాలంలోనే రూ.20వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేశారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ,ఎస్సీ,ఎస్టీలకే ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకులమైన తాము గానీ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ చౌకబారు రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పారు.

ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్న మంత్రి..
చంద్రబాబు హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టారని... వాటిల్లో ఒక్క కేసు కూడా నిరూపించలేకపోయారని అన్నారు. తాను కూడా ఓ బీసీ ఎమ్మెల్యేని అని... బీసీల ఆత్మాభిమానం గురించి టీడీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. చట్టం ముందు అన్ని కులాలు,మతాలు సమానమేనని చెప్పారు. వైసీపీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ ఓర్వట్లేదని విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్లు ఇస్తుంటే... కోర్టుకు వెళ్లి అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. ఆ లబ్దిదారుల్లో 22 లక్షల మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలే ఉన్నారని చెప్పారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామన్నారు.












Click it and Unblock the Notifications