ఆళ్ళగడ్డ రాళ్ళదాడి: బాబు మీటింగ్కు అఖిలప్రియ డుమ్మా, ఏం జరుగుతోంది?
అమరావతి: కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య విభేదాలపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం నాడు జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రి అఖిలప్రియ ప్రకటించడం గమనార్హం. అయితే పార్టీ రాష్ట్ర కార్యాలయవర్గాలు మాత్రం ఈ విషయమై మంత్రి అఖిలప్రియకు సమాచారాన్ని ఇచ్చినట్టుగా ప్రకటించారు. ఈ విషయమై ఏప్రిల్ 26వ తేదిన ముఖ్యమంత్రితో సమావేశం కావాలని అఖిలప్రియ భావిస్తున్నట్టు సమాచారం.
Recommended Video
టిడిపికి డిపాజిట్టు కూడ రాదు, వాళ్ళిద్దరితో పార్టీకి నష్టం: రాంపుల్లారెడ్డి సంచలనం
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టిడిపిలో మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించేందుకు చంద్రబాబునాయుడు ఇద్దరిని అమరావతికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే ఈ సమావేశానికి హజరయ్యారు. మంత్రి అఖిలప్రియ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు.
ఏప్రిల్ 22వ తేదిన ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న ఏవీ సుబ్బారెడ్డిపై కొందరు రాళ్ళతో దాడి చేశారు. ఈ ఘటనపై టిడిపి నాయకత్వం సీరియస్గా తీసుకొంది. దీంతో వీరిద్దరిని అమరావతికి రావాల్సిందిగా బాబు ఆదేశించారు.
అఖిలప్రియ డుమ్మా
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకొన్న గ్రూపు తగాదాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఏవీ సుబ్బారెడ్డి హజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రి అఖిలప్రియ మాత్రం హజరుకాలేదు. ఈ విషయమై తనకు సమాచారం లేదని మంత్రి అఖిలప్రియ చెబుతున్నారని సమాచారం. అయితే పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి అఖిలప్రియ హాజరుకాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అఖిలప్రియ ఎందుకు రాలేదు
ఆళ్ళగడ్డలో టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డితో నెలకొన్న విభేధాలపై చర్చించేందుకుగాను ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి అఖిలప్రియ ఎందుకు హజరుకాలేదనే అంశం ప్రస్తుతం టిడిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి ఈ సమావేశంలో ఆమె పాల్గొనకడం ఇష్టం లేకనే రాలేదనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై చంద్రబాబుతో తన అభిప్రాయాన్ని అఖిలప్రియ గురువారం నాడు చెప్పే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
వైసీపీలో చేరుతాననేది ప్రచారం మాత్రమే
తాను వైసీపీలో చేరుతాననేది అవాస్తవమని టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం పిలుపు మేరకు అమరావతికి చేరుకొన్న ఏవీ సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారేది లేదన్నారు. ఆళ్లగడ్డలో తను సైకిల్ ర్యాలీపై అఖిలప్రియ కావాలనే దాడి చేయించిందని ఆరోపించారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానన్నానే తప్ప తనకు తానుగా పోటీ చేస్తానని చెప్పలేదని అన్నారు. తండ్రి సమానుడైన తనపై అఖిలప్రియ దాడి చేయించడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు.
తారాస్థాయికి విభేధాలు
ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఆళ్ళగడ్డలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబునాయుడు సూచించిన రెండు రోజులకే ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ ర్యాలీపై రాళ్ళదాడి చోటు చేసుకొంది. భవిష్యత్తులో ఆళ్ళగడ్డ నుండి ఏవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారనే ఆందోళన భూమా అఖిలప్రియకు ఉందని సుబ్బారెడ్డి వర్గీయలు చెబుతున్నారు.ఈ కారణంగా సుబ్బారెడ్డిపై దాడికి దిగారని వారు ఆరోపిస్తున్నారు. పోటా పోటీగా ఈ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సమస్యను పరిష్కరించకపోతే పార్టీకి నష్టం తప్పదని పార్టీ మాజీ ఇంఛార్జీ రాంపుల్లారెడ్డి ప్రకటించారు.