మంత్రి పదవులపై బొత్స తేల్చేసారు- మూడు రాజధానుల బిల్లు తెస్తున్నాం : ఏపీలో షర్మిల పార్టీ పైనా :..!!
ఏపీ సీనియర్ మంత్రి బొత్సా మంత్రివర్గ విస్తరణ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత కాలంగా కేబినెట్ లో అందరినీ తప్పిస్తారని..కొత్తవారితో భర్తీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా త్వరలో నే కేబినెట్ విస్తరణ అంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ మొదలైంది. సీనియర్లను పార్టీ సేవలకు వినియోగిస్తారని పార్టీలో జరుగుతున్న ప్రచారం. దీని పైన స్పందించిన మంత్రి బొత్సా మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ విషయంలో తాను గానీ, పెద్దిరెడ్డిగానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సమాధానమిచ్చారు.

మూడు రాజధానుల బిల్లు త్వరలో
కేబినెట్ విస్తరణపై సీఎందే తుది నిర్ణయమన్నారు. ఇక, ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటు పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల పార్టీ పెట్టినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. ఇక్కడ ఉన్న పది పార్టీల్లో అది కూడా ఒకటిగా మిగిలిపోతుందన్నారు.
మూడు రాజధానుల బిల్లులో చిన్నచిన్న సమస్యలు ఉండడం వల్ల వెనక్కు తీసుకున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బిల్లు ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే కొత్తబిల్లు ముందుకు వస్తుందని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల బిల్లులను త్వరలోనే సమగ్రంగా చట్టసభల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ పై
వచ్చే సాధారణ ఎన్నికల్లో పొత్తుపై మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లవ్ ట్రాక్ అనేది వాళ్ళ ఇష్టమని చెప్పారు. చంద్రబాబు, పవన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు విడాకులు తీసుకుంటారో తమకేం తెలుసని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో చంద్రబాబుది చెదిరిన చరిత్ర అని, రానున్న రోజుల్లో ఆయన పేరు ఉండదని బొత్సా చెప్పుకొచ్చారు.
కుప్పంలో స్థానిక ఎన్నికల ఓటమిపై ప్రతిపక్షనేత ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజులుగా చంద్రబాబు చేస్తున్న పర్యటనలో ఆయన ఆవేదన చూస్తున్నామని, సీఎం జగన్పై, తమ పార్టీపై విమర్శలు చేయడం తప్ప మరొకటి లేదన్నారు.

చంద్రబాబును చూస్తుంటే జాలేస్తోంది
పార్టీ పూర్వ వైభవానికి మళ్లీ పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భాష, మాట చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. పేదల ఇంటిపై రిజిస్ట్రేషన్తో కూడిన హక్కును కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకాన్ని టీడీపీ సైతం సమర్థిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతోనే టీడీపీ మొదట్లో ఆరోపణలు చేసిందన్నారు. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ప్రస్తుతం మాట మారుస్తు ఓటీఎస్ను సమర్థించక తప్పని పరిస్థితి ఎదురైందన్నారు.












Click it and Unblock the Notifications