అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లే?
అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లేనని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయం భూ సేకరణ, నిర్వాసితుల పునరావాస పనులు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై విజయనగరంలో బొత్స సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తోపాటు జిల్లాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులంతా పాల్గొన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉండాలనే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

వచ్చే నెలలో ప్రధాని చేతులమీదగా శంకుస్థాపన
వచ్చే నెలలో గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు. వీటిపై కొన్ని కోర్టు వివాదాలు ఉన్నప్పటికీ అవి త్వరలోనే పరిష్కారం కానున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ వెనక ఉండి నడిపిస్తోంది కాబట్టే అమరావతి రైతులు తమ పాదయాత్రను విరమించుకున్నారని, పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటున్నారు? దానికి సంబంధించి ఆధారాలను ఇవ్వాలని కోర్టు అడిగినట్లు తెలిపారు.

పట్టుమని 60 మంది రైతులు కూడా లేరు
600 మందితో జరుగుతున్న పాదయాత్రలో పట్టుమని 60 మంది రైతులు కూడా లేరని, దీంతో టీడీపీ ముసుగులో ఉన్న అమరావతి రైతులు తమ పాదయాత్రను ఆపేసినట్లు బొత్స వివరించారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, విశాఖపట్నం రాజధానిగా సాధించేందుకు అవసరమైన రూట్ మ్యాప్ ను త్వరలోనే నిర్ణయించబోతున్నామన్నారు. హైకోర్టు అనుమతితో అమరాతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు సెప్టెంబరు 12వ తేదీ నుంచి 60 రోజులపాటు అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో అమరావతినే ఏకైకా రాజధానిగా ఉంచాలనే డిమాండ్ తో పాదయాత్రను ప్రారంభించారు.

తాత్కాలికంగా యాత్రకు విరామం ప్రకటించిన రైతులు
రాజమండ్రి చేరుకున్న తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులకు సంఘీభావం తెలియజేసేవారు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని, నిరసన తెలియజేసేవారు దూరంగా ఉండి తెలియజేయవచ్చని హైకోర్టు ధర్మాసనం ప్రకటించడంతో పోలీసులకు, రైతులు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో నాలుగురోజులపాటు తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేయాలని రైతులు నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications