చీప్ గా లోకేష్ ఆరోపణలు - పేపర్ ఎక్కడా లీక్ కాలేదు : మంత్రి బొత్సా..!!
పదో తరగతి పరీక్షా పత్రాల లీక్ వ్యవహారం.. రాజకీయ ఆరోపణల పైన మంత్రి బొత్సా స్సందించారు. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరిగితే రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. విద్యార్ధుల పేరెంట్స్ మనోభావాలను దెబ్బ తీయవద్దని కోరిన మంత్రి బొత్సా.. విద్యార్ధుల భవిష్యత్ తో ముడి పడని అంశంగా గుర్తించాలని సూచించారు.
నారా లోకేష్ చేస్తున్న ఆరోపణలు చీప్ గా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆరు లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ లోకేష్ కు పట్టదా అని ప్రశ్నించారు. టెన్త్ పేపర్ లీకుల విషయంలో నారాయణ, చైతన్య, కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ తదితర అక్రమాలకు పాల్పడిన వాటిపై తీసుకుంటామని.. అవసరమైతే ఆ స్కూళ్ల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రూములలో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్లు చెప్పారు. పేపర్ ఇవ్వకముందు ఎక్కడా లీక్ కాలేదని స్పష్టం చేసారు. గతంలో లాగా డబ్బులు ఆశ చూపెట్టి ముందుగా లీకులు చేయటం లాంటిది జరగలేదని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి బొత్సా తేల్చి చెప్పారు. పేపర్ల లీకేజీ ఆరోపణల్లో 69 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. అందులో 36 మంది ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారని వివరించారు.
దొరికిన వీరంతా పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫోటోలు తీసుకుని బయటకు పంపారని మంత్రి చెప్పారు. ఉయ్యూరులో ఐదుగురు టీచర్లు ఆన్సర్లు తయారు చేస్తుండగా పట్టుకున్నామని మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. అయితే, ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పరీక్ష పత్రం లీక్ అయినట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజాగా.. సీఎం జగన్ టీడీపీ నేత లోకేష్ రాసిన లేఖ రాజకీయంగా చర్చకు కారణమైంది. దీని పైన బొత్సా సైతం స్పందించారు. పరీక్షల తరువాత రాజకీయం చేద్దామంటూ సూచించారు. అయితే, పరీక్షలు ముగిసిన తరువాత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వారి పైన ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications