విశాఖ నుంచి పరిపాలనకు జగన్ సిద్ధం! ఎప్పుడంటే..?
విశాఖపట్నంను ఏపీ పాలనా రాజధానిగా వద్దన్నవారంతా చరిత్రహీనులవుతారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి ఒక విధానం లేదని, రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు కూడా లేవని మండిపడ్డారు. పరిపాలనా రాజధాని విశాఖ నుంచి త్వరలోనే సీఎం జగన్ విధులు నిర్వహించబోతున్నారని తెలిపారు. మూడు రాజధానులపై సీఎం నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారని, పరిపాలనా రాజధానిగా విశాఖ తప్పక వస్తుందననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్ రాజధాని కావాలా? వద్దా? అని ఇంటింటికీ వెళ్లి అడిగితే తెలుస్తుందన్నారు. సిద్ధాంతం లేని జనసేన అనేది రాజకీయ పార్టీ కాదని, వైజాగ్ ను పవన్ ఎందుకు వద్దంటున్నారు? గత ఎన్నికల్లో ఆయన ఇక్కడినుంచే పోటీ చేశారు కదా? అని బొత్స గుర్తుచేశారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర కొవ్వూరుకు చేరుకుంది. గత నెల 12వ తేదీన ప్రారంభమైన యాత్ర ఇప్పటికి 34 రోజులు పూర్తిచేసుకుంది. అసెంబ్లీ నుంచి అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామివారి దేవాలయం వరకు 60 రోజులపాటు 600 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. యాత్ర దారిపొడవునా పోలీసులను తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ అమరావతి రైతులు వాపోతున్నారు.
మరోవైపు అమరావతికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో వైసీపీ విశాఖ గర్జన నిర్వహించింది. కార్యక్రమం ముగించుకొని విమానాశ్రయానికి చేరుకున్న మంత్రుల కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనసేన కార్యకర్తలే దాడిచేశారని మంత్రులు ఆరోపించగా, తమవారెవరూ కాదంటూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహన్ ప్రకటన చేశారు. అమరావతి రైతులు పాదయాత్ర విశాఖపట్నం చేరుకునే క్రమంలో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయేమోనని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాత్రకు ఎవరూ ఆటంకం కలిగించొద్దంటూ డీజపీ ఆదేశాలు జారీచేశారు.