మామను చంపిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని మహానాడు: మంత్రి బొత్సా ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క టిడిపి మహానాడు, మరోపక్క వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
టీడీపీ మహానాడు.. ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్ళు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల పార్టీ ప్రస్థానం నేపథ్యంలో, ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో టిడిపి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలి వచ్చారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ గా కొనసాగించిన మహానాడు ఈసారి ప్రజా క్షేత్రంలో నిర్వహించడంతో రెట్టించిన ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
టీడీపీ మహానాడులో వైసీపీ సర్కార్ టార్గెట్ గా చంద్రబాబు వ్యాఖ్యలు
టిడిపి మహానాడులో చంద్రబాబు వైసీపీ ని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పై నిప్పులు చెరిగిన చంద్రబాబు మూడేళ్లలో జగన్ సర్కారు చేసిన అరాచకాలను ఏకరువు పెట్టారు. క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే సామాజిక న్యాయ భేరీ పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో మంత్రులు తెలుగుదేశం పార్టీ మహానాడుపై విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబు మహానాడుపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ
ఇప్పటికే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ చేసేది మహానాడు కాదు వల్లకాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టిడిపి పనైపోయిందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . చచ్చిన పార్టీకి ప్రజలు దహనసంస్కారాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక టీడీపీ మహానాడు కార్యక్రమంపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు అందరికీ తెలుసనీ, ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పిన ఎవరూ నమ్మరని అన్నారు.
మామను చంపి తద్దినం పెట్టి ఇప్పుడు మహానాడా? బొత్సా ఫైర్
మామ ను చంపి తద్దినం పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మహానాడులో చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని బొత్ససత్యనారాయణ తేల్చి చెప్పారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తాం అని కలలు కంటున్నారని, కానీ చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పాలన కంటే ఉన్మాది పాలన ఎవరిదని ప్రశ్నించిన బొత్సా
చంద్రబాబు పాలన కంటే ఉన్మాది పాలన ఎవరిదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మామను చంపిన అల్లుడు మామ శతజయంతి ఉత్సవాలు చేయడానికి ఏ విధంగా అర్హుడో చెప్పాలని బొత్ససత్యనారాయణ చంద్రబాబును టార్గెట్ చేశారు. టీడీపీ మహానాడు టార్గెట్ గా బస్సు యాత్రలో అడుగడుగునా వైసీపీ మంత్రులు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీ ప్రజలు చంద్రబాబును ఆదరించరని తేల్చి చెప్తున్నారు.