సిగ్గనిపించడం లేదా.. చంద్రబాబును చెడమడా కడిగేసిన మంత్రి బొత్స..
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉండి హైదరాబాద్లో కూర్చోవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల వల్ల కరోనా వస్తుందని చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కరోనా రావటం ఆయన భాధ్యతారాహిత్యం కాదా అని నిలదీశారు.పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తీర్మానాలు చేస్తూ.. నిస్సిగ్గుగా రాజకీయ దురాలోచనలు చేస్తున్నారని విమర్శించారు.
హుద్హుద్ సమయంలో విశాఖ జిల్లాలో రెండు, మూడు రోజులు తాగేందుకు నీళ్లు కూడా లేవని, సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకొని దోచుకుతినే తత్వం చంద్రబాబుది అని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని.. రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. 'ఏ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారో చెప్పండి. నేను వస్తా. మీరూ నాతో రండి. అక్కడే వాస్తవాలు చెబుదాం.' అని చంద్రబాబుకు బొత్స సవాల్ విసిరారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి కొంటున్నామని.. కరోనాతో ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తతకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని అన్నారు. ఇటీవలే జగనన్న విద్యా దీవెన, జీరో వడ్డీ పథకాలు ప్రారంభించామన్నారు. చంద్రబాబు హయాంలో జీరో వడ్డీ అమలు చేయకుండా మహిళలను మోసం చేశారని విమర్శించారు. బాబు దోచుకున్నదంతా బయటకు తీయాలన్నారు.
25లక్షల రేషన్ కార్డులు తొలగించామని ఆరోపిస్తున్నారని.. ఆరోపణలు చేయడం కాదు నిరూపించాలని సవాల్ చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని అన్నారు. హైదరాబాద్లో కూర్చొని విమర్శలు చేసేందుకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications